PM CARES Fund: ఎట్టకేలకు పీఎం కేర్స్ గుట్టు రట్టు-8452 కోట్ల బ్యాలెన్స్..!
ప్రధాన మంత్రి సహాయ నిధి స్ధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కేర్స్ నిధికి వస్తున్న విరాళాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో .. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కేంద్రం ఈ వివరాలను బయటపెట్టింది. 2025 మార్చి 31 నాటికి తమ వద్ద రూ.8,452 కోట్లు ఉన్నట్లు పీఎం కేర్స్ (PM Cares Fund) వెల్లడించింది. ఈ మేరకు తమ వెబ్ సైట్ లో ఆడిట్ నివేదికల వివరాలను కేంద్రం తాజాగా అప్ లోడ్ చేసింది.
పీఎం కేర్స్ నిధికి సంబంధించి న 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను కేంద్రం నిన్న తమ వెబ్ సైట్ లో పెట్టింది. ఇందులో ఆగస్టు 6న ఖాతాల ఆడిట్ నిర్వహించినట్లు, ఆగస్టు 7న ఆడిటర్లు వాటిపై సంతకాలు చేసినట్లు కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం, విరాళాలు, డిపాజిట్లపై వచ్చిన వడ్డీ రూపంలో పీఎం కేర్స్ నిధికి రూ.1,200 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి. అలాగే 2025 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.87 లక్షలు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే 2025 మార్చి 31 కల్లా రూ.8,452 కోట్ల బ్యాలెన్స్ ఉంది.

కోవిడ్ నేపథ్యంలో మార్చి 2020లో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితులు, విపత్తులను ఎదుర్కోవడానికి ఈ పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసంది. దీనికి మొదటి మూడేళ్లలో రూ.13 వేల కోట్లు నిధులు వచ్చాయి. దీన్ని ప్రారంభించిన మొదటి వారంలోనే సుమారు 3 వేల కోట్లు జమ అయ్యాయి. అయితే తాజాగా పీఎం కేర్స్ నిధిపై కాక్రోచ్ జనతా పార్టీ చేసిన వ్యాఖ్యలతో చర్చ మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీని టార్గెట్ చేసే క్రమంలో బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు వారి ఆర్ధిక వనరులపై ప్రశ్నలు వేశారు. దీనికి వ్యంగంగా కౌంటర్ ఇస్తూ పీఎం కేర్స్ నిధే తమ ఆదాయ వనరు అంటూ వారికి చురకలు అంటించింది. పీఎం కేర్స్ నిధిని బీజేపీ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారా అన్న చర్చ కూడా సాగింది. దీంతో కేంద్రం వివరాలు వెల్లడించింది.













Click it and Unblock the Notifications