మద్యం మానేందుకు పసరు మందు తాగితే ప్రాణాలే పోయాయి
అమరావతి: మద్యం అలవాటును మానిపించేందుకు తాగించిన పసరు మందు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని లాల్ బంద్ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. అనంతపురం పట్టణ సీఐ రాఘవన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రియాజ్ (25) అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో లాల్బంద్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అయితే బతుకుతెరువు కోసం జిల్లాను వదిలి కర్నూలు జిల్లాలోని తిమ్మరాయుని పేటకు మూడు నెలల క్రితం వలస వెళ్లాడు. అక్కడ చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.
కాగా, రియాజ్కు మద్యం తాగే అలవాటు ఉంది. ఇతగాడి తాగుబోతుతనం వల్ల కుటుంబం ఆర్ధిక ఇబ్బందులకు కూడా గురవుతూ ఉండేది. దీంతో మద్యం మానేస్తే కుటుంబం బాగుంటుందని పలుమార్లు అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో మద్యం మానేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తన స్వగ్రామమైన అనంతపురం పట్టణంలోని లాల్బంద్ వీధిలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. మద్యం మానివేసేందుకు పసరు మందు తెచ్చుకుంటానని ఓ గ్రామానికి వెళుతున్నట్లు ఇంట్లో ఉన్న తన భార్యకు చెప్పి వెళ్లాడు.
ఆ గ్రామం నుంచి పసరు మందు తెచ్చుకున్నాడు. ఆ మందును శనివారం రాత్రి తాగాడు. మందు తాగిన అరంగట వ్యవధిలోనే రియాజ్కు విరేచనాలు అయ్యాయి. ఈ విరేచనాలు రక్తవిరేచనాలుగా మారడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో ఆతడికి వైద్యులు చికిత్సను అందించారు. అయినప్పటికీ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతపురం వన్టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications