వదిన శవాన్ని మోసుకెళ్తుండగా విరిగిన తాటిబొండు, మరిది మృతి
అమరావతి: వదిన మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తూ మృతి చెందాడో వ్యక్తి. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా రేపల్లే మండలంలోని పిరాట్లంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బంధువులు, పోలీసుల కథనం ప్రకారం బొమ్మిడి రాఘవమ్మ (80) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.
మంగళవారం మధ్యాహ్నం రాఘవమ్మ మృతదేహాన్ని బంధువులు అంత్యక్రియలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని సమీపంలోని శ్మశానవాటికకు మెయిన్ కెనాల్పై వేసిన తాటిబొండ్లపై నడుచుకుంటూ తీసుకు వెళుతున్నారు.
ఈ క్రమంలో తాటిబొండు ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో శవంతో పాటు దానిని మోసే ఐదుగురు వ్యక్తులు కాలవలో పడిపోయారు. బొండు విరిగి గంగడిపాలెంకు చెందిన బొమ్మిడి సుబ్బారావు(48) మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బంధువుల్లో ఒకడైన తుమ్మా చిన్న వెంకటేశ్వరావుకు తీవ్ర గాయాలు కావటంతో తొలుత రేపల్లెలో ప్రథమ చికిత్సకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా కుటుంబసభ్యులైన మీరాసాహెబ్, వీరాస్వామి, కనకయ్యకు స్వల్ప గాయాలు కావటంతో రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న రేపల్లే ఎమ్మెల్యే సోదరుడు అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్, తహసీల్దార్ ఎం.నాగిరెడ్డి, ఎంపీడీవో శోభారాణి, ఆర్ఐ ఏసుదాస్ మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.