దారుణం: కూర రుచిగా వండలేదని భార్యను చంపిన భర్త
అమరావతి: కూర రుచిగా వండలేదని భర్త క్షణికావేశంతో కొట్టడంతో భార్య మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోచోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ అచ్చబ గ్రామానికి చెందిన కోలక లక్ష్మణరావు చింతపండు సేకరించి అమ్ముతుంటాడు.
రోజూలాగే సోమవారం కూడా చెట్ల నుంచి సేకరించిన చింతపండును కురుపాం మండల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించి సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి భోజనంలో కూర సరిగా వండలేదని భార్య కోలక లక్ష్మమ్మ (44)తో గొడవ పడ్డాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన క్షణికావేశంలో లక్ష్మణరావు ఇంటిలో ఉన్న వెదురుకర్రతో లక్ష్మమ్మ పొట్ట, వీపుపై బలంగా కొట్టాడు. దీంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు కుప్పకూలిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రథమ చికిత్స అందించారు.
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ ఒంటి గంట సమయంలో మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న మృతురాలి సోదరుడు మిన్నారావు మంగళవారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు ఎల్విన్పేట సీఐ జి.వేణుగోపాల్, ఎస్ఐ ఎస్.రాజు, పోలీసు సిబ్బంది అచ్చబ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు ముగ్గురుకు కుమార్తెలు, ఒక కుమారుడు. వారందరికీ వివాహమైంది. లక్ష్మమ్మ చనిపోవంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.