చచ్చిందని భార్యపై వేడి నూనె పోసి భర్త పారిపోయాడు
బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 24 ఏళ్ల ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు కె. ఆంజనేయులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను మెదక్ జిల్లాకు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తలు యాదగిరిగుట్టకు దైవదర్శనానికి వచ్చారు. రాత్రిపూట వారికి వసతి లభించలేదు. దీంతో ఆరుబయటే ఉండాలని నిర్ణయించుకున్నారు.
కట్టెలు పెట్టి వంట చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో వారిద్దరికి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆంజనేయులు భార్యను ఇనుప రాడ్తో కొట్టాడు. వేడివేడి నూనెను ఆమెపై పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.
తల్లిదండ్రుల సాయంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో పాటు మరో వ్యక్తి ఉన్నారని, ఎవరో తెలియదని ఆమె అంటోంది. సంగారెడ్డిలో వడ్రంగి పనిచేస్తున్న తన భర్తకు మరో భార్య ఉందని, దాంతో తమ ఇరువురి మధ్య గొడవ జరుగుతోందని బాధిత మహిళ చెప్పింది.