డబ్బులు అడిగితే లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు బయటపెడతా!
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం తాజాగా విజయవాడలో మరోసారి కలకలం సృష్టించింది. ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న కేసులో కాల్ మనీ వ్యాపారి మండవ రవికాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మండవ రవికాంత్ అరాచకాలపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళన చేపట్టాయి. కృష్ణలంకలోని రవికాంత్ ఇంటి ఎదుట ఆయనకు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేపట్టారు.
పోలీసులు కథనం ప్రకారం మండవ రవికాంత్ అనే కాల్ మనీ వ్యాపారికి అధికార పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో తన పలుకబడిని ఉపయోగించి రెండు రూపాయల వడ్డీ చెల్లిస్తానని మహిళల వద్ద డబ్బులు వసూలు చేశాడు.
ఇలా విజయవాడ వ్యాప్తంగా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును కాల్ మనీలో పెట్టుబడిగా పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే కాల్ మనీ కేసుకు సంబంధించిన కేసులో కూడా అరెస్టయ్యాడు.
వడ్డీకి డబ్బులు తీసుకున్న మహిళలను లైంగికంగా కూడా వేధిస్తున్నాడని ఆరోపణలున్నట్లు పోలీసులు వెల్లడించారు. రవికాంత్కు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అడిగిన మహిళలను కూడా బెదిరించేవాని తెలుస్తోంది.
రుణంగా మహిళల వద్ద తీసుకున్న డబ్బుని అడిగితే వారి అశ్లీల చిత్రాలను పెన్ డ్రైవ్, డీవీడీలలో సేవ్ చేశానని, వాటిని బయటపెడతానని తరచుగా వేధింపులకు గురిచేసేవాడని బాధితులు వాపోతున్నారు. రవికాంత్కు అండగా ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.