ఉచిత గ్యాస్ పథకం క్రెడిట్ పవన్ ఖాతాలో..!!
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు రంగం సిద్దమైంది. రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్నారు. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఈ పథకం ఉప ముఖ్యమంత్రి పవన్ ఆలోచనల మేరకే అంటూ మంత్రి మనోహర్ చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ మొదలైంది.
ఉచిత సిలిండర్ పథకం
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీల్లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకం రేపు ప్రారంభం కానుంది. ఈ పథకానికి తొలి ఏడాది రూ.2,684 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తొలివిడతగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి అయ్యే మొత్తం రూ.894 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందించారు. గ్యాస్ సిలిండర్లు అందిన 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం కోసం ఇప్పటికే ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండి, తెల్ల రేషన్కార్డు, ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులేన ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
పవన్ ఆలోచన మేరకే
ఉచిత సిలిండర్లను కూడా లబ్ధిదారు లు ఎప్పటిలాగే ముందుగా గ్యాస్ ధరను చెల్లించి సిలిండర్లు బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన 24 గంటల్లో గ్యాస్కు ముందుగా చెల్లించిన మొత్తం లబ్ధిదారుల ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే, తాజాగా మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళలకు ఉపయోగపడేలా ఏదైనా పథకాన్ని అమలు చేయాలని పవన్ ఆలోచన మేరకే మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని చేర్చినట్లు మనోహర్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు, కూటమి పక్షాల మద్దతుతోనే ఈ పథకం అమలు అవుతుందని చెప్పుకొచ్చారు. జనసేన ప్రజా ప్రతినిధులు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి మనోహర్ సూచించారు.

మార్చి వరకు ఒకటే
ఇక..ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఒక్కటి మాత్రమే లబ్ది దారులకు అందించనుంది. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా వచ్చే మార్చి నెలాఖరు వరకు ఒక్కటి మాత్రమే ఉచితంగా అందనుంది. ఆ తరువాత 2025 డిసెంబర్ లోగా మరో రెండు సిలిండర్లు అందించాలని డిసైడ్ అయింది. ఇక.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ పథకం అమలు కానుంది. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిన తరువాత వారిని సైతం ఈ పథకంలో లబ్ది దారులుగా చేర్చే అంశం పరిశీలనకు వస్తుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications