దేవరగట్టు కర్రల సమరం -పగిలిన తలలు : వంద మందికి గాయాలు- నలుగురు విషమంగా..!!
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అర్థరాత్రి ప్రారంభమైంది.కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ, కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కానీ, క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే ఈ కర్రల సమరంలో ఈ సారి కూడా ప్రతీ ఏటా చోటు చేసుకొనే పరిణామాలే రిపీట్ అయ్యాయి. హింస చోటు చేసుకుంది. ఏటా మాదిరిగానే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో హింస చెలరేగింది.
ఎప్పటిలానే బన్నీ ఉత్సవంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. దసరా బన్ని జైత్రయాత్రలో తాజాగా చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు. ప్రతీ ఏటా ఇక్కడ చోటు చేసుకొనే హింస పైన గతంలో మానవ హక్కుల కమిషన్ సైతం జోక్యం చేసుకుంది. జిల్లా అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కళ్ళెదుటే హింస జరుగుతుంటే , పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించాయి.
Recommended Video
అయినప్పటికీ దేవరగట్టులో హింస జరగడం మాత్రం కంట్రోల్ కావటం లేదు. అర్ద్రరాత్రి దాటిన తరువాత కూడా ఇంకా ఉత్సవం పేరుతో కర్రల సమరం సాగతూనే ఉంది. దీంతో..అసలు ఏం జరిగింది...ఎంత మంది చికిత్స పొందుతున్నారనేది జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.