ఇక ఉండను!: జగన్కి మారెప్ప గుడ్బై, కాంగ్రెస్లోకేనా?
న్యూఢిల్లీ: మాజీ మంత్రి మారెప్ప వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పినట్లే భావించొచ్చు. గత కొద్ది రోజులుగా మారెప్ప ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరుగుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానంతో కన్నతల్లి లాంటి కాంగ్రెసు పార్టీని కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరానని, ఇకపై తాను జగన్ పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. ఆయన కాంగ్రెసులోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శనివారం మారెప్ప ఢిల్లీలో మాట్లాడుతూ మరోసారి జగన్ పైన నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం పేరుతో హిట్లర్ రాజ్యం తెస్తున్నారని, జగన్ బాధితుల సంఘం ఏర్పాటు చేస్తే ఎందరో బయటకు వస్తారని, తాను జెండాను మోసేవాడిని కాదని.. అజెండాను మోసేవాడినన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని షిండేను కోరానన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీల్లో నిరుద్యోగులున్నారని, వారు నక్సలైట్లుగా మారకుండా ఉండే విధంగా చూడాలని మారెప్ప పేర్కొన్నారు. జగన్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేస్తే చాలామంది ఆ పార్టీ నుండి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు.