చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరు వైద్య విద్యార్థుల దుర్మరణం
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దెందులూరు మండలం నారాయణపురం వద్ద ఓ కారు అదుపు తప్పి హైవేపై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కపురం గ్రామంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లక్కపురానికి చెందిన ఎం. సౌజన్య (16) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య పాలకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
పాముకాటుతో చిన్నారి మృతి
శ్రీకాకుళం జిల్లాలో నాగుపాము కాటు వేయడంతో ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని గేదెలవానిపేటలో ఈ ఘటన జరిగింది. సిమ్మా యామిని (5) శనివారం ఉదయం నిద్రలోంచి లేవలేదు. దీంతో తల్లి రమ్య కదిలించి చూడగా మరణించినట్లు తెలిసింది. పాప పాము కాటు వల్లనే మరణించినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications