ఆ హక్కు ఉంది: కేసీఆర్, మంత్రి పదవి కోసమేనని ఎంపీ
హైదరాబాద్: తెలంగాణకు 265 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉందని, అందుకు అనుగుణంగా చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. హైదరాబాద్ సహా ఐదు నగరాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తాను అన్ని నగరాలను పరిశీలిస్తానని చెప్పారు.
నగరాల కోసం రూ.10 కోట్లు అవసరమన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని చెప్పారు. డిసెంబర్ నుండి మే వరకు చెరువుల పునరుద్ధరణ చేపడతామన్నారు. 265 టీఎంసీలకు అనుగుణంగా చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. చెరువుల పునరుద్ధరణలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని 45,300 చెరువులలో.. ఏడాదికి 9060 చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పైన ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స అందించేందుకు నార్కట్ పల్లి వద్ద మెడికల్ కళాశాలతో పాటు ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ విషయమై మంత్రి రాజయ్యకు కేసీఆర్ సూచనలు ఇచ్చారు.

హైదరాబాదు సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాల అభివృద్ధి బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. ఈ పట్టణాల్లో బడ్జెట్ సమావేశాల తరువాత పర్యటించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
మంత్రి పదవి కోసమే: కడియం శ్రీహరి
టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావుపై తెరాస ఎంపీ కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్లో కడియం మాట్లాడారు. తెరాసలో చేరిన టీడీపీ నేతలను అడ్డం పెట్టుకుని ఎర్రబెల్లి కూడా టీఆర్ఎస్లో చేరాలనుకున్నారని ఆరోపించారు. మంత్రి పదవి కోసం ప్రయత్నించారన్నారు. అలాంటి ఎర్రబెల్లి తెరాసను, తమ పార్టీ నేతలను విమర్శించడం ఆయన సంస్కారాన్ని ఎత్తి చూపుతోందన్నారు. తాను తెరాసలోకి వచ్చేందుకు ప్రయత్నించలేదని ఎర్రబెల్లి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
పట్టించుకోను: డాలర్ శేషాద్రి
ఇటీవలే హృద్రోగ సమస్య కారణంగా ప్రాణాపాయ స్థితి ఎదుర్కొన్న టీటీడీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) డాలర్ శేషాద్రి కోలుకున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆపత్కాలంలో తనకు అండగా నిలిచిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కొందరు తనపై వ్యతిరేక ప్రచారం చేశారని, అలాంటి వాటిని పట్టించుకోనన్నారు. రేపటి నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతోనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకొచ్చారు. ఇది తనకు పునర్జన్మ అని పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా డాలర్ శేషాద్రి గుండెపోటుకు గురవడం తెలిసిందే.












Click it and Unblock the Notifications