పదో తరగతి పరీక్షలు నచ్చిన మీడియంలో - ఎంపిక ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్ధులకు పరీక్షల్లో వెసులు బాటు కల్పించింది. విద్యార్ధులు తమ సౌలభ్యం మేరకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎంపిక విధానాలను ఖరారు చేసింది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ వచ్చిన అభ్యర్ధనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నచ్చిన మీడియంలో
ఏపీలో పదో తరగతి విద్యార్ధుల పరీక్షల విధానంలో ప్రభుత్వం వెసులు బాటు కలిగించింది. పదో తరగతి విద్యార్ధులు తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో పరీక్షలు రాసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు కోసం పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మీడియంని ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఆప్షన్ను మార్చుకోవచ్చని వెల్లడించింది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్ధనలు రావటంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి ఈ మేరకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇబ్బందులు లేకుండా
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్ధులను ఇంగ్లీషు మీడియం లోకి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంగ్లీషు మీడియం అమలు పైన సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీంతో..ఇంగ్లీషు మీడియం అని కాకుండా.. ఒకే మీడియం అని ప్రస్తావన చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్ధుల సంఖ్య 6.20 లక్షలు ఉండగా.. వారిలో 4.94 లక్షల మంది నామినల్ రూల్స్ లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అందులో 39 వేల మంది వరకు తాము తెలుగులోనే పరీక్షలు రాస్తామని స్పష్టం చేసారు.
ఈ ఏడాది వరకే
పాఠశాలల్లో బోధన కోసం ద్విభాష పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసారు. అయితే, అనేక చోట్ల తెలుగు లోనే పాఠాలు చెప్పారు. ఒకేసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్పు చేయడంతో పలువురు విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలు ఇంగ్లీషులో రాయాలంటే మరింత సమస్యగా మారుతోంది. దీంతో, విద్యార్ధుల ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పరీక్షలు వారు కోరుకున్న మీడియంలో రాసుకునే విధంగా వెసులు బాట కల్పించాలని కోరారు. దీంతో, ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం వరకు పదో తరగతి విద్యార్ధులు వారు కోరుకున్న మీడియంలో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications