సినీ పెద్దలు పవన్ కు మద్దతుగా లేరు - ఏపీ ప్రభుత్వం పగబట్టింది : నాగబాబు సంచలనం..!!
ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమతో పాటుగా..పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని మెగా బ్రదర్ నాగబాబు ఆరోపించారు. వకీల్సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకు పవన్పై కక్ష కట్టిందన్నారు. 'భీమ్లా నాయక్' చిత్రానికి ఉద్దేశపూర్వకంగా పాత జీవోనే అమలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్పై పగబట్టి తీసుకున్న నిర్ణయమంటూ వీడియో సందేశంలో నాగబాబు పేర్కొన్నారు. జీవో విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. పవన్పై పగబట్టి ఇలా చేస్తున్నా.. ఎవరూ మాట్లాడటం లేదని, సినిమా పెద్దలు పవన్కు మద్దతు ఇవ్వకపోవటం దురదృష్టకరని వ్యాఖ్యానించారు.

ధైర్యం చాలటం లేదా
ఇది తప్పు అని చెప్పేందుకు ఎందుకు ధైర్యం చాలడం లేదని సినీ పెద్దలను నిలదీశారు. అగ్ర హీరోకే ఇలా జరుగుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా తాము సహకరిస్తామని తెలిపారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటామని నాగబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఐదేళ్లే. ఈ అధికారం శాశ్వతం కాదు. ఆ తరువాత ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందేనని స్పష్టం చేసారు. మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.

మీ కోసం పవన్ నిలబడతారు
ఇప్పుడు మీరు పవన్కు మద్దతుగా మాట్లాడకపోవచ్చు. కానీ, రేపు మీకేదైనా సమస్య వస్తే పవన్ తప్పకుండా నిలబడతాడు. మీ తరఫున పోరాడతాడు' అని నాగబాబు స్పష్టం చేశారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ మాట్లాడింది సినిమా పరిశ్రమ బాగు కోసమేనని వివరించారు. భీమ్లానాయక్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ఏపీ రెవిన్యూ అధికారులు థియేటర్లకు నోటీసులు ఇచ్చారు.
బెనిఫిట్ షో నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీంతో.. పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీ పైన టీడీపీ - బీజేపీ నేతలు సైతం విమర్శలు చేసారు. ప్రభుత్వం నుంచి మాత్రం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తో షాక్ లో ఉన్నామని..దీని కారణంగానే జీవో జారీ ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు
మంత్రి బొత్సా లాంటి వారు సినిమాను వాయిదా వేసుకోవాల్సిదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం భీమ్లానాయక్ అయిదో షో ప్రదర్శను రెండు వారాల పాటు అనుమతి ఇచ్చింది. దీంతో..తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సహకరిస్తుంటే..ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
చిరంజీవి తో పాటుగా హీరోలు సీఎం జగన్ ను కలిసిన సమయంలో అయిదో షో ప్రదర్శనుకు సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం హీరోలు చెప్పుకొచ్చారు. కానీ, అధికారికంగా జీవో జారీ చేయకపోవటంతో ఇప్పటి వరకు పాత నిర్ణయాలే అమలు అవుతున్నాయి. ఇదే సమయంలో పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు దక్కటం లేదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications