గృహిణిపై భర్త సోదరుల పైశాచిక దాడి...అత్త కూడా...మొత్తం కెమేరా కంటికి చిక్కారు...
విశాఖపట్నం: పండగకి కన్న వాళ్ల ఇంటికి వెళ్లాలనుకున్న ఓ వివాహితను ఆమె భర్త సోదరులే చావబాదిన దారుణ ఘటన ఇది. ఈ ఘోరం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న అత్త సాటి మహిళ అనే కనికరం చూపకపోగా తాను కూడా కర్రతో దాడి చేసింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం గుల్లిపల్లెలో జరిగిందీ సంఘటన.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...ఈ ఘటనలో చావుదెబ్బలు తిన్న బాధితురాలి పేరు లక్ష్మీ. ఆమె భర్త ఆర్మీలో పనిచేసేవాడు. అయితే కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడటంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు లక్ష్మీని తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు. ఆమె కూడా పండగకు సొంతూరు వెళ్లాలని సిద్దపడింది.
అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని ఆమె వెళ్లడానికి వీలు లేదంటూ ఆమె భర్త అన్నలు ఇద్దరు తమ తమ్ముడి భార్య పైనే దాడికి దిగారు. కాళ్లతో ఎగిరెగిరి తంతూ, చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ అమానుషంగా చావబాదారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ఆమె అత్త కొడుకుల్ని వారించడానికి ప్రయత్నించలేదు సరికదా ఆమె కూడా బాధితురాలిపై కర్రతో దాడి తీవ్రంగా కొట్టింది.
ఈ దాడి జరుగుతున్న అలజడికి చుట్టుప్రక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులతో పాటు వారి తల్లిని అరెస్ట్ చేసి, విచారణ చేపడుతున్నారు. ఈమె పండుగకి ఇంటికి వెళితే ఆమె భర్తను ఎవరు చూడాలనే విషయంపై గొడవ జరిగివుండొచ్చని స్థానికులు అంటున్నారు.