కేసీఆర్కు షాక్, మాదేనంటూ గోల్కొండలో ఆర్మీ పహారా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తొలిసారి జరగనున్న పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో అట్టహాసంగా నిర్వహించాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆర్మీ షాకిచ్చింది. గోల్కొండ ప్రాంతంలో తమ ల్యాండ్ ఉందని, ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలన్న తమ అనుమతి తీసుకోవాలని ఆర్మీ చెబుతోంది.
గోల్కొండ కోటలోని తమ భూములు ఉన్న ప్రాంతంలో వేడుకలకు తాము అనుమతించేది లేదని, అవి తమవేనని చెప్పే పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఆర్మీ చెబుతోంది. తమ పరిధిలోని ప్రాంతంలో వారు అనుమతి లేకుండా ఎలా వేడుకలు నిర్వహిస్తారని చెబుతున్నారు.
గోల్కొండ కోటలో అట్టాహాసంగా వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తుండగా, ఇప్పుడు ఆర్మీ పహారా కాయడంతో వేడుకలు గోల్కొండ కోటలోనే జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, వేడుకల కోసం ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని ఆర్మీ చెబుతోంది. అయితే, ప్రభుత్వం అనుమతి తీసుకుంటే వేడుకలకు ఆర్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చునంటున్నారు.
కాగా, గోల్కొండ కోటలో సీఎం జెండా ఎగురవేసే ప్రాంతం తప్ప, పోలీసులు మార్చ్ చేసే ప్రాంతం వంటివి ఆర్మీకి చెందినవిగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటే వేడుకలు నిర్వహించుకునే అవకాశముందంటున్నారు. పంద్రాగస్టు వేడుకల నిమిత్తం సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది బుధవారం ఉదయం కోటకు వెళ్లింది. వారిని ఆర్మీ అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు వాదనకు దిగాయి.