ఏపీలో బైజూస్ రగడ: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి: మండిపడిన మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎడ్యు టెక్ కంపెనీ బైజూస్ తో ఒప్పందం చేసుకుంది. పోటీ ప్రపంచంలో పిల్లలను సిద్ధం చేయడం కోసం రాష్ట్ర విద్యా రంగంలో మరో భారీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు బైజూస్ తో ఒప్పందంపై మండిపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బైజూస్ ఒప్పందంపై ప్రభుత్వ తీరుపై, విద్యాశాఖ మంత్రి పై నిప్పులు చెరిగారు.

బైజూస్ తో ఒప్పందంపై చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
ఇక టిడిపి నేతల వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పటికే చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడిన బొత్ససత్యనారాయణ బైజూస్ అంటే మ్యాంగో జ్యూస్ , హెరిటేజ్ జ్యూస్ నో కాదు.. అదేంటో తెలియాలంటే నీ మనవడిని అడుగు అంటూ సెటైర్లు వేశారు. ఇక తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబును టార్గెట్ చేశారు. పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అంటూ నిప్పులు చెరిగారు.

కావాలనే టీడీపీ నాయకుల అడ్డంకులు
కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూస్తున్నారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరుపేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, చంద్రబాబు, టిడిపి నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆదిమూలపు సురేష్ అసహనం వ్యక్తం చేశారు. కేవలం ధనవంతులకే సొంతమైన ఎడ్యూ టెక్ ను స్కూల్లో విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వం బైజూస్ తో ఒప్పందం చేసుకుందని, ఇది విద్యలో గేమ్ చేంజర్ అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

చంద్రబాబు విద్యార్థులు చదువుకుంటే చూసి తట్టుకోలేరు
ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశం అని పేర్కొన్న ఆయన కావాలని చంద్రబాబు దీనిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటూ మండిపడ్డారు. బైజూస్ తో ఒప్పందం ద్వారా ఒక్కో విద్యార్థికి 20 నుంచి 25 వేల వరకూ ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవ వల్ల బైజూస్ సంస్థ తమ కంటెంట్ ను విద్యార్థులకు ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో బైజూస్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉందని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకుంటే చూసి తట్టుకోలేరని ఆరోపించారు.

నిన్నటిదాకా ఇంగ్లీష్ మీడియంపై, ఇప్పుడు బైజూస్ పై రాద్దాంతం
ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బైజూస్ పైన కూడా తన అక్కసును వెళ్లగక్కారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని ప్రయత్నం చేస్తుంటే జ్యూస్ అంటూ అవహేళన చేస్తున్నారని పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని విమర్శించారు.












Click it and Unblock the Notifications