జనసైనికులూ... ఆలోచించండి ,ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి: అంబటి రాంబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టిడిపి జనసేన పొత్తును ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైందని, తాము కలిసి వెళితేనే వైసిపి దౌర్జన్యాన్ని ఎదుర్కోగలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వమని, తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను ఎదుర్కోవడానికి తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు తో ములాఖత్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, బాలకృష్ణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యి భవిష్యత్తు రాజకీయాలపై చర్చించారు. అనంతరం బయటకు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల పొత్తులపై సంచలన ప్రకటన చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖత్ కావడం పైన, వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తామని ప్రకటించడం పైన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఇది ఇప్పుడు ఏదో కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారని, తెలిసిందే కదా ఇది అన్నట్టు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. చంద్రబాబుతో ఎప్పుడో అయ్యాడు ములాఖత్.. ఇప్పుడేముంది కొత్తగా అంటూ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్ళు ఎవరూ లేరని పేర్కొన్నారు. జన సైనికులు ఆలోచించండి.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలా లేదూ అంటూ చంద్రబాబు అరెస్టు జరిగి టిడిపి ఇబ్బందులలో ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్నాడని అంబటి రాంబాబు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications