పేరుకే 3 రాజధానులు... పాలనంతా విశాఖ నుంచే..
పేరుకు మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ పరిపాలన మొత్తం విశాఖపట్నం నుంచే సాగుతుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. 'మన విశాఖ..మన రాజధాని' పేరుతో శ్రీకాకుళంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో 33 వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు.. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంగీకరించలేదనే తమపై బురద జల్లుతున్నారని, విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖ రాజధానిపై ప్రజల్లో చలనం తీసురావాలనే ఉద్దేశంతోనే తాను 'రాజీనామా' అన్నానని మంత్రి వెల్లడించారు.

అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ప్రకటించారు. రైతుల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుర్తింపుకార్డులు చూపించాలని, కోర్టు నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ డీఎస్పీ అడ్డుచెప్పడంతో రైతులు తాత్కాలికంగా తమ పాదయాత్రను నిలిపివేశారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని, రైతులతో కలవకూడదని, అలాగే మూడు రాజధానులకు మద్దతు తెలియజేసేవారు యాత్రకు దూరంగా తెలియజేసుకోవచ్చంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు తీసుకొనే యాత్రను పున:ప్రారంభిస్తామంటూ రైతులు అమరావతి గ్రామాలకు తిరిగి వెళ్లారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా అమరావతికి సంబంధించి కీలకమైన తీర్పు మంగళవారం వెలువడబోతోంది.












Click it and Unblock the Notifications