మరో షాక్: ఏ క్షణంలోనైనా మంత్రి గంటా ఆస్తుల వేలం!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగలనుంది. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లు, హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్..
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగలనుంది. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లు, హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్.. ఇక వాటిని వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఆస్తులను వేలం వేయనున్నట్లు తెలిసింది.
అయితే, గంటాకు సంబంధించిన ఆ ఆస్తులు వేలం వేసినా ఇండియన్ బ్యాంకు ఇచ్చిన రుణం మొత్తం తిరిగి వసూలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ, బహిరంగ మార్కెట్లో ధరలను చూసినా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లకు మించి రాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విశాఖలోని డాబాగార్డెన్స్లోగల ఇండియన్ బ్యాంకు ప్రధానశాఖ నుంచి ప్రత్యూష రిసోర్సెస్, ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో సంస్థ డైరెక్టర్లతోపాటు హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెందిన 26 ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
వడ్డీతో రూ.196 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. స్వాధీనం చేసుకున్నవాటిలో కొన్ని ఖాళీ స్థలాలతో పాటు, పలు నిర్మాణాలూ ఉన్నాయి. బ్యాంకు స్వాధీనం ప్రకటన చేసినందున.. ఎప్పుడైనా వేలం వేసే అవకాశాలున్నాయి. అయితే, బ్యాంకుకు రావాల్సిన రుణం, వడ్డీ మొత్తాన్ని అధికారులు సమీకరించగలరా? అనేది అనుమానంగానే మారింది.
కాగా, ఆస్తుల వేలం అంటే తప్పనిసరిగా ఆదాయ పన్నుశాఖకు లెక్కలు చూపాల్సిందే. ప్రభుత్వ ధరల ప్రకారం చూసినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవచ్చని భావిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు హామీదారుగా ఉండటంతో బ్యాంకు ఉన్నత స్థాయిలోనూ చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
చివరకు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లతోపాటు హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో వీటిని వేలం వేయడంతోపాటు మిగతా మొత్తానికి సంబంధితవర్గాలపై కోర్టులో కేసులు వేసే అవకాశాలున్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు.