జగన్ విశాఖ వెళ్లాడు కానీ: పవన్ కళ్యాణ్కు గంటా శ్రీనివాస రావు సలహా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మద్దతు పలకాలని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు కావాల్సిన విద్యా సంస్థలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఏపీకి 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వాటిని నెరవేర్చకుంటే నాడు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే భారతీయ జనతా పార్టీకి కూడా పడుతుందని చెప్పారు.
జవదేకర్ విడుదల చేయలేదు
తాము ఏపీకి ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని చేశామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారని, కానీ ఆయన వ్యాఖ్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని గంటా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. ఆయన శ్వేతపత్రం విడుదల చేయకపోవడంతో తాను విడుదల చేస్తున్నానని చెప్పారు. ఏపీలో ఏడు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
భూమి, నిధులు రాష్ట్రం ఇచ్చింది
ఐదు సంస్థలకు మూడేళ్ల క్రితం 2015లో ప్రారంభించారని, అవి తాత్కాలిక భవనాల్లో, తాత్కాలిక సిబ్బందితో కొనసాగుతున్నాయని గంటా చెప్పారు. మరో పదిహేడు విద్యా సంస్థలకు అవసరమైన భూమిని, నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యా రంగంపై రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
కేంద్రం ఆరు శాతం మించి ఇవ్వలేదు
ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును తేవడం ద్వారా రాజధాని అమరావతిలో వాటి క్యాంపస్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని గంటా చెప్పారు. కేంద్రం విద్యా సంస్థలకు ఆరు శాతానికి మించి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మాతో కలిసి రండి
జగన్, పవన్ కళ్యాణ్లు కేంద్రం హామీలపై పోరాడేందుకు ముందుకు రావాలని, తమతో కలిసి పోరాడాలని గంటా శ్రీనివాస రావు సూచించారు. విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర కొనసాగిందని, కానీ ఆయన మాత్రం రైల్వే జోన్ అంశంపై కేంద్రాన్ని డిమాండ్ చేయలేదన్నారు. రాఫెల్ స్కాంపైనా పవన్, జగన్లు మాట్లాడటం లేదన్నారు.