చంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్..!!
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై కర్నూలు జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తోన్నాడని మండిపడ్డారు. ఇన్నేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఏ మాత్రం ఆదరాభిమానాలను సంపాదించుకోలేకపోయారని చురకలు అంటించారు. అందుకే సానుభూతితో ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

పోటీ అనుమానమే..
కర్నూలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి జీ జయరాం విలేెకరులతో మాట్లాడారు. ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజలు, వారి సంక్షేమం గురించి ఆలోచించ లేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికొస్తోండటంతో మళ్లీ ప్రజల్లోకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని ధ్వజమెత్తారు. 2024 తనకు చివరి ఎన్నికలు అని మాట్లాడుతున్న చంద్రబాబు.. అప్పుడు కూడా పోటీ చేస్తాడో.. లేదోనని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి చేశారా?
దేశ రాజకీయాల్లో తాను అత్యంత సీనియర్ అని చెప్పుకొని కర్నూలు జిల్లాలో తిరుగుతున్న చంద్రబాబుకు ఆ వయసు, ఆ అనుభవంతో ప్రజలకు మంచి చేశారా? అని ప్రశ్నించారు. ఏ రోజూ ప్రజలను ఆదుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల వ్యవధిలోనే కోట్లాది మంది ప్రజలకు మేలు చేశారని అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు.

అర్హత ఉన్నవారందరికీ పథకాలు..
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దకే జగన్ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి జయరాం గుర్తు చేశారు. చంద్రబాబు-జగన్ ప్రభుత్వాల మధ్య తేడాను ప్రజలు చూశారని అన్నారు. ఇక చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. తాను అసెంబ్లీలో శపథం చేసి వచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని, ఆయన ఎందుకు బయటికి వచ్చాడో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కూడా చంద్రబాబుకు మద్దతిచ్చే పరిస్థితిలేదని అన్నారు.

2019లో చివరి ఎన్నికలు..
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ 2019లోనే చివరి ఎన్నికలను ఎదుర్కొన్నారని, ఇక గెలిచే పరిస్థితి లేదని జయరాం తేల్చి చెప్పారు. 2024లో చంద్రబాబు పోటీ చేస్తాడనే తాను అనుకోవట్లేదని అన్నారు. 2014లో నరేంద్రమోడీతో, 2019లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడని, అయినా ఓటమి తప్పలేదని అన్నారు. 2024లో ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. ఓటమి మాత్రం ఖాయమని జయరాం ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ పదవి..
2024 ఎన్నికల్లో చంద్రబాబు అసలు పోటీ కూడా చేస్తాడో లేదోనని గుమ్మనూరు జయరాం అనుమానం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీకి చంద్రబాబు రాజీనామా చేస్తే- వైసీపీ తరఫున ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ పెట్టారు. ఆయన కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్కు కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేడని, అందుకే కోఆప్షన్ మెంబర్ పదవి ఇస్తామని మంత్రి జయరాం ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications