అది జగన్ కోరిక మాత్రమే!: 'కుంగిన నేల' వార్తలపై మంత్రి నారాయణ ఆగ్రహాం
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మూడు అడుగుల మేర నేల కుంగిందంటూ గురువారం వచ్చి వార్తా కథనాలపై ఏపీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నేరుగా వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 'భూమి ఎక్కడ కుంగిందో చూపండి' అంటూ ఆయన మీడియా ప్రతినిధులను నిలదీశారు. ''24 గంటలూ సచివాలయంలోనే ఉంటా. నేల ఎక్కడ కుంగిందో వచ్చి చూపించండి'' అంటూ ఆయన సవాల్ విసిరారు.
ప్రధానంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో ఈ వార్త ప్రధానంగా ప్రసారమైంది. వైసీపీ అధినేత వైయస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి ఛానెల్లో గురువారం సాయంత్రం రుతు పవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో మట్టి బాగా నానిపోవడంతో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవంతి వద్ద నేల మూడు అడుగుల మేరకు కుంగిపోయిందని వార్త ప్రసారమైంది.
అమరావతిలో కలకలం, 3 అడుగులు కుంగిన నేల, దెబ్బతిన్న సచివాలయ ఫ్లోరింగ్
దీనిని ప్రశ్నించిన ఆయన ''24 గంటలూ సచివాలయంలోనే ఉంటా. నేల ఎక్కడ కుంగిందో వచ్చి చూపించండి'' అంటూ సవాల్ విసిరారు. వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్న నారాయణ ... ఈ తరహా చౌకబారు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు.
అంతకముందు వెలగపూడికి బయల్దేరకు ముందు ఆయన విజయవాడలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆయన కుటుంబ ఆధ్వర్యంలోని మీడియా సంస్ధలపై సెటైర్లు సంధించారు. ''అమరావతిలో భూమి కుంగిపోవాలన్నది జగన్ కోరిక మాత్రమే. జగన్ కోరికనే ఆయన మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వాస్తవానికి అక్కడ భూమి కుంగిపోలేదు'' అని నారాయణ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.