Chandrababu స్కామ్ లు చేస్తే అరెస్ట్ చెయ్యరా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్న!!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో వైసిపి మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా విద్యుత్ మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ అనుభవం ఉంటే మాత్రం స్కాములు చేస్తే అరెస్టు చేయరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు తప్పని కొన్ని మీడియా సంస్థలు వాదిస్తున్నాయి అని మండిపడిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల రూపాయలు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు.
ఏ కారణం లేకుండా ఓ ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వం తరఫున మూడువేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మొత్తం 3356 కోట్ల ప్రాజెక్టులో సీమెన్స్ కంపెనీ, ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో 371 కోట్ల రూపాయలను చంద్రబాబు అండ్ కో మింగేశారని అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి అని పేర్కొన్నారు.

చంద్రబాబు స్వయంగా చేసిన స్కాం కాబట్టి ఏమి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగిందని, పక్కా ఆధారాలతోనే సిఐడి చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు బదలాయించాలని పని చేసిన సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులు కూడా ఇందులో నిందితులని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
రాజకీయలబ్ధి కోసం కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన చంద్రబాబు చేసిన స్కాం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, సిపిఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరికీ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
వీరంతా చంద్రబాబుకు మద్దతు తెలపడం, బాబు అరెస్టు పైన విమర్శలు చేయడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించారని, కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబును అరెస్టు చేయాల్సి వచ్చిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications