సొంత ఊర్లలోనే అన్నదమ్ములు చిత్తుగా ఓడిపోయారంటే - మంత్రి రోజా..!!
జనసేన అధినేత పవన పైన మంత్రి రోజా ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదు..గెలనీయకుండా చూస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. పవన్ గతంలో 2019 ఎన్నికల సమయంలోనే ఇదే తరహాలో జగన్ సీఎం అవ్వరు..తన శాసనమని చెప్పారని రోజా గుర్తు చేసారు. జగన్ సీఎం అయ్యారని..ప్రజలు పవన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని నాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నారో అర్దం కావట లేదన్నారు.

పవన్ ను ఓ నటుడిగా అంతా గౌరవిస్తాం
పవన్ ను ఓ నటుడిగా అంతా గౌరవిస్తామని మంత్రి రోజా పేర్కొన్నారు. కానీ, వీకెండ్ రైటప్స్ తో వస్తే జనం ఆదరించరని చెప్పారు. షూటింగ్ గ్యాప్ లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే ప్రజలు అవే తిరిగి చూపిస్తారంటూ వ్యాఖానించారు. రాజకీయమంటే పార్ట్ టైమ్ కాదని, ఫుల్ టైమ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కేవలం సీఎం కుర్చీ కోసమే రాజకీయం చేస్తామంటే సినిమాల్లోనే కుదురుతుందన్నారు. సినిమా హీరో వస్తే ఓట్లేసేస్తారనే రోజులు పోయాయని రోజా చెప్పుకొచ్చారు. ఇప్పటికే వారానికి ఓసారి రాష్ట్రానికి వచ్చి పోతున్నారని ఎద్దేవా చేసారు. ఈసారి జనం ఓడిస్తే రాష్ట్రం చుట్టుపక్కలకు కూడా రారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు , పవన్ కు ఈ రాష్ట్రంలో ఓటుందా, ఇల్లుందా..అడ్రస్ ఉందా అని రోజా ప్రశ్నించారు.

పవన్ గతాన్ని గుర్తు చేసుకోవాలి
చంద్రబాబు వెనుక తోకలా తిరిగే వ్యక్తి పవన్ అని విమర్శించారు.పవన్ గతాన్ని ఓ సారి గుర్తు చేసుకోవాలని రోజా సూచించారు. పవన్ తో పాటు ఆయన అన్నలను కూడా జనం ఓడించారని గుర్తు చేసారు. సొంత ఊర్లలోనే మీ అన్నదమ్ములు చిత్తుగా ఓడిపోయారంటే మీ మీద మీ వాళ్లకే నమ్మకం లేదని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారని చెబుతూ..ఇంటా ఓడిపోయారు, రచ్చా ఓడిపోయారన్నారు. చంద్రబాబు లాగే పవన్ కు ఓ అక్రమ కట్టడంలో లింగమనేని ఓ స్థలం ఇచ్చారన్నారు. పార్టీ మూసేస్తే హైదరాబాద్ వెళ్లిపోతారని ఎద్దేవా చేసారు.

వారాహితో గంగలో దూకినా ఎవరూ పట్టించుకోరు
బీసీల మీద పవన్ కు అసలు ప్రేమ లేదన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, ఆయన వారాహి గంగలో దూకినా ఎవరూ పట్టించుకోరని రోజా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏరోజైనా రెండు కాళ్ల మీద సరిగా నిలబడ్డారా అని ప్రశ్నించారు. కాపులకు మంచి చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని రోజా చెప్పుకొచ్చారు. పోలవరం పైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసారు. దేవినేని ఉమా ఉన్నప్పుడు ఏం చేసారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications