ఆ ఒక్క జెండా మోస్తే పవన్ కళ్యాణ్ గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు: మంత్రి రోజా సెటైర్లు
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు అసలు తను ఎందుకు పార్టీ పెట్టారో తెలీదు అని రోజా పేర్కొన్నారు . దేశంలో ఎవరైనా తాము అధికారంలోకి రావాలని పార్టీ పెడతారని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరొకరి జెండా మోయడానికి పార్టీ పెట్టారని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఇక మిగిలింది కేఏపాల్ జెండానే అంటూ రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.ఇప్పటికి పవన్ కళ్యాణ్ టిడిపి, బీజేపీ జెండాలు మోశారని, ఒక కేఏపాల్ జెండా కూడా మూసేస్తే పవన్ కళ్యాణ్ గిన్నిస్ బుక్ ఎక్కెయ్యొచ్చునని మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆ పని కూడా చేయాలంటూ రోజా సూచించారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి, బిజెపికి ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ ఆ జెండాలు మోసుకుంటూ తిరుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఏదో చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన ఎవరూ నమ్మరని, సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు ఏం చేసాడు అనేది అందరికీ తెలుసన్నారు.
తొమ్మిదేళ్లుగా పార్టీ పెట్టి ఎప్పుడు ఏ జెండా మోద్దామా, ఏ ప్యాకేజీ కి కట్టుబడి ఉందామా అని చూస్తున్నారన్నారు.2024లో ఆ జెండా కూడా మోసేస్తే పవన్ గిన్నిస్ బుక్ కి ఎక్కుతారని రోజా పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందించారని, మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్కసారి కూడా జగన్ లా సంక్షేమ పథకాలు అందించలేదని రోజా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల లో ఎక్కడా జగన్ పై వ్యతిరేకత లేదని రోజా చెప్పారు. గతంలో కులాల పేరుతో రాజకీయాలు చేశారని,ఈ కులం టీడీపీ,ఈ కులం జనసేన, ఈ కులం బిజెపి,ఈ కులం వైసిపి అంటూ ప్రజల మధ్య విభజన చేశారని, కానీ ఇప్పుడు ఏ కులము లేదన్నారు రోజా.
అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మంత్రి రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లినపుడు ప్రజలు చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదని, నభూతో నభవిష్యతి అన్న చందంగా ప్రజలు జగన్ తోనే ఉన్నామని మిస్డ్ కాల్ ద్వారా చెప్పారన్నారు.
ఒక కోటి 15 లక్షల మంది ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి మేము మీతో ఉన్నామని చెప్పడం ఏ రాష్ట్రంలోనూ ఎవరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా జరిగే పని కాదని రోజా పేర్కొన్నారు. వైయస్ఆర్ కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని,అందుకే ప్రజలు కూడా వైసిపికి అండగా ఉంటున్నారని రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications