డ్రామాలు కట్టిపెట్టండి..? చంద్రబాబు డైరెక్షన్లోనే కమలం నేతలు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల దాడి పెరిగింది. సీఎం జగన్ పాలనపై కమలం నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాలపై సెటైర్లు విసురుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ వ్యయాలను కామెడీ సినిమాలతో పోల్చారు. జగన్ మాటలకు చేతలకు పోంతన లేదని దుయ్యబడుతున్నారు.

అభివృద్ధిని అడ్డుకోవడమే వారి పని..
రాష్ట్ర బీజేపీ నేతల విమర్శలకు అధికార వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు . ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి.. ప్రతి పనిని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు డైరెక్షన్లోనే..
టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీ నేతలు పనిచేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్ , కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పే సత్తా, దైర్యం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు, ఎంపీ జీవీఎల్కు ఉందా ? అని నిలదీశారు. బీజేపీ నేతల డ్రామాలు ప్రజలకు నమ్మేపరిస్థితి లేదని మండిపడ్డారు. వారి కపట నాటకాలు ఇప్పటికైనా కట్టిపెట్టాలని హితవు పలికారు.
Recommended Video

పవన్ కల్యాణ్కు తోడుగా బీజేపీ ..
గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరే చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్లు చదివేవారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పుడు పవన్ కల్యాన్కు తోడుగా బీజేపీ నేతలు తోడయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. వీరు ఏపీ అభివృద్ధిని సైంధవుల్లా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు ఎంతమంది వచ్చి అడ్డుపడినా రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేసి తీరుతారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications