మంత్రి విడదల రజిని చాయ్ పె చర్చా..!!
పల్నాడు: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీపడట్లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటోన్నారు.
గడప గడపకు..
అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు వైఎస్ జగన్. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.
భవిష్యత్లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. ఈ కార్యక్రమాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదంటూ ఫిర్యాదులను అందుకున్న అధికార పార్టీ సిట్టింగ్ శాసన సభ్యులకు సున్నితంగా వార్నింగులను సైతం జారీ చేస్తోన్నారు.
క్లీన్ స్వీప్ కోసం..
175 నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలను వైఎస్ జగన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తర-తమ తేడా చూడట్లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఏ ఎమ్మెల్యే అయినా ఈ లక్ష్యాన్ని సాధించేలా పనులను చెయ్యకపోతే ఇప్పుడే చెప్పాలని, వారి సేవలను తాను మరో రూపంలో వినియోగించుకుంటాననే సంకేతాన్ని పంపిస్తోన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా..
ఈ పరిణామాల మధ్య శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రజలను కలుసుకుంటోన్నారు. మంత్రులు కూడా దీనికి మినహాయింపు కాదు. తమను ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తోన్నారు మంత్రులు. అటు శాఖాపరమైన సమీక్షలతో గడుపుతూ- ఇటు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటోన్నారు.
చిలకలూరిపేటలో..
తాజాగా మంత్రి విడదల రజిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. నియోజకవర్గంలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటోన్నారు. ప్రజలతో మమేకమౌతున్నారు. వారి కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును నేరుగా వారి నుంచే అడిగి తెలుసుకుంటోన్నారు. వలంటీర్ల పనితీరు, గ్రామ/వార్డు సచివాలయాల గురించి ఆరా తీస్తోన్నారామె.
టీ స్టాల్ వద్ద..
ఈ క్రమంలో ఓ టీ స్టాల్ వద్ద ఆమె టీ తాగడం ఆకర్షించింది. తన వెంట ఉన్న అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ కనిపించారు మంత్రి విడదల రజిని. టీ స్టాల్ యజమాని విశ్వనాథంతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందుతోన్న సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయని ప్రశ్నించగా.. తాను రెండుమూడు పథకాల ద్వారా లబ్ది పొందుతున్నానని వివరించారాయన.