అసలు మతలబు ఇదీ?: జగన్ మీడియాకు చిక్కిన ఈశ్వరి 'డీల్', ఆ వీడియోలో ఏముంది!..
Recommended Video
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని సాక్షి బయటపెట్టింది.
అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు.
కానీ ఆమె మాటల వెనుక అసలు మతలబు వేరే ఉందన్నది సాక్షి మరియు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న వాదన. గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు వెనుక ఉన్న అసలు విషయాలు సాక్షాధారాలతో సహా వారికి చిక్కినట్టు తెలుస్తోంది.
ఆ వీడియోలో ఏముంది?:
పార్టీ మారే ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలు, స్థానిక నేతలతో గిడ్డి ఈశ్వరి సమాలోచనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఓ వీడియో రూపంలో సాక్షికి చిక్కినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ వీడియో టేపుల్లో ఆమె ఏం మాట్లాడారంటే..' చంద్రబాబు అంటే మాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.. మామూలుగా అయితే వెళ్లాలని లేదు.. ఆ పార్టీలోకి వెళ్లడం మాకు ఇష్టం లేదు. డిఫర్ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది.. నేనేం చెబుతున్నానంటే.. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే.. రేపు.. ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవి ఇస్తామన్నారు.. జాయిన్ అయి వెళ్లిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేబినెట్ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా' అంటూ చెప్పుకొచ్చారట.
కడిగిపారేస్తోన్న వైసీపీ:
వీడియో టేపులు చిక్కడంతో అటు టీడీపీని, ఇటు గిడ్డి ఈశ్వరిని వైసీపీ కడిగి పైకి అభివృద్ది అని చిలకపలుకులు పలుకుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని విమర్శిస్తోంది. వైసీపీని నేరుగా ఎదుర్కోవడం చేతగాకనే ఇలా ప్రలోభాలతో దెబ్బతీస్తున్నారని ఆ పార్టీ వాపోతోంది. నంద్యాల ఉపఎన్నిక తర్వాత నుంచి ఆకర్ష్ మంత్రను మళ్లీ తెర మీదకు తెచ్చిన టీడీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను, రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరిని, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని వైసీపీ నుంచి బయటకు లాగడంలో సఫలమైంది. మున్ముందు మరింత మందిని వైసీపీకి దూరం చేయడానికి కంకణం కట్టుకుంది.
అచ్చెన్న మాటల్లో అర్థం అదే!:
వైసీపీ నేతలను అంతర్గత ప్రలోభాలతో ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కొంతమందికి బాధ్యతలు అప్పజెప్పినట్లు తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలే చెబుతున్నాయి. వైసీపీలో పెద్ద తలకాయను లాగడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన బహిరంగంగానే చెప్పారంటే.. వైసీపీని ఖాళీ చేసేంతవరకు టీడీపీ నిద్రపోనట్లుగానే అనిపిస్తోంది.
ఇప్పటికైనా అప్రమత్తమవుతారా?
పార్టీ నుంచి వరుసపెట్టి నేతలు బయటకు వెళ్తున్నా.. వలసలను ఆపేందుకు జగన్ గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికీ ఎక్కడా కనిపించడం లేదు. పీకె లాంటి వ్యక్తిని రాజకీయ సలహాదారుగా నియమించుకుని కూడా సొంత పార్టీనే ఆయన కాపాడుకోలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతూ వస్తోంది.
ఇక జగన్ పాదయాత్ర ద్వారా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే.. ఆ శ్రమను వృథా చేయడానికి టీడీపీ ఇలాంటి పన్నాగాలు పన్నుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం దృష్టిని ఫిరాయింపుల వైపు తిప్పడం ద్వారా జగన్ పాదయాత్రకు సంబంధించిన చర్చను ప్రజల్లో లేకుండా చేయాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో వైసీపీ అప్రమత్తంగా లేకపోతే ఆ పార్టీకి మరిన్ని వరుస దెబ్బలు తప్పవు.