తిరుమల దర్శన లేఖలస్తే లక్షలిస్తాం - మంత్రికి బ్రోకర్ల ఆఫర్..!!
తిరుమలలో దళారులు కొత్త అవతారం ఎత్తారు. ప్రభుత్వం తిరుమలలో ప్రక్షాళన చేస్తామని చెబుతున్నా...దళారులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. శ్రీవారి దర్శన సిఫార్సు లేఖలు తమకు ఇస్తే నెలకు రూ 15 లక్షల నుంచి రూ 20 లక్షల వరకు ఇస్తామంటూ నేరుగా మంత్రులకే ఆఫర్ ఇస్తున్నారు. ఈ ప్రతిపాదనతో షాక్ అయిన మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. ప్రలోభాలకు లొంగ వద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
సిఫారసు లేఖలతో
తిరుమలలో దర్శనం చేయిస్తామంటూ దళారులు వ్యాపారం కొనసాగిస్తున్నారు. పలువురు భక్తులు ఈ బ్రోకర్లు, నకిలీ టికెట్లతో ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ఎన్నిసార్లు వీరిని పట్టుకున్నా..పూర్తి స్థాయిలో మాత్రం నిరోధించలేకోతోంది. ఇప్పుడు వీరు దర్శన సిఫార్సు లేఖలు ఇస్తే లక్షలు ఇస్తామంటూ ఏకంగా మహిళా మంత్రికే ఆఫర్ ఇవ్వటం కలకలంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తామని చెబుతున్నా...దళారులు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు.

మంత్రికి ఆఫర్
టీటీడీ పాలక మండలి నియామకం కోసం అధికారులు, మంత్రులతో కలసి సీఎం ఇటీవల కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖల అంశం చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో ఉన్న ఓ మహిళా మంత్రి మరికొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. ఇటీవల తిరుపతి నుంచి కొంతమంది దళారులు తనవద్దకు వచ్చారని, ప్రతినెలా రూ.15లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని, తన లేఖలు మొత్తం వారికి ఇవ్వాలని ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ ఆఫర్కు అంగీకరించారని కూడా వారు చెప్పినట్లు వివరించారు.
లేఖల నియంత్రణ
ఈ విషయాలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. తాను ఆ దళారులను మందలించి పంపేశానని, తాను ఇచ్చే లేఖలు ఒకటికి రెండుసార్లు పరిశీలించి, బాగా తెలిసిన వారికి మాత్రమే ఇస్తున్నట్లు ఆ మంత్రి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం... ఇది కరెక్టు కాదని, దీనిని కట్టడి చేయాలని ఆదేశించారు. సిఫారసు లేఖల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిణామాలతో టీటీడీ సిఫారసు లేఖల విషయంలో సీఎంవో అధికారులు అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. టీటీడీ లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎంవో అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications