కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్-దుష్ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే-లేనిపోని అపోహలు సృష్టించవద్దని..
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్,ఆయుష్ అధికారులు నివేదికలు ఇచ్చాక... మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మందు పనిచేస్తుందని ఇప్పటికే రుజువైనప్పటికీ... శాస్త్రీయంగా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని నిర్దారించేందుకే దానిపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఆనందయ్య మందుపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం సరికాదన్నారు.
అలా జరిగితే మొదట సంతోషించేది జగనే...
ఒక విపత్తును ఎదుర్కొనే క్రమంలో ఆనందయ్య ఇచ్చే మందు సత్ఫలితాలు ఇస్తే మొదటగా సంతోషించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాకాని అన్నారు. ఇప్పటికే ఆయుష్ బృందం ఆనందయ్య మందు ను పరిశీలించిందని... దానిపై అధ్యయనం చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు.
సోమవారం(మే 23) ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వచ్చి ఆనందయ్య మందును పరిశీలిస్తుందన్నారు. ఆయుష్,ఐసీఎంఆర్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాక మందు పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. సానుకూలంగా రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం మందు పంపిణీకి సంబంధించి ప్రత్యేక విధి విధానాలను రూపొందించి ముందుకు వెళ్తుందన్నారు.
ఆ ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే...
ఆనందయ్య మందు కరోనాకు విరుడుగా పనిచేస్తోందని జనం అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీని పట్ల చొరవ చూపించారని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఐసీఎంఆర్తో మాట్లాడి దీనిపై అధ్యయనానికి చొరవ చూపించారని చెప్పారు.
ఇక ఆనందయ్యను అరెస్ట్ చేశారు... జైల్లో నిర్బంధించారు... అని సాగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. ఆనందయ్య,ఆయన అనుచరులు పోలీస్ భద్రత నడుమ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. కాబట్టి లేనిపోని ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.
కోటయ్య అనారోగ్యంపై ఆనందయ్య రియాక్షన్...
ఆనందయ్య మాట్లాడుతూ... ప్రస్తుతం తాను బయటకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికెళ్లినా జనం మీద పడి సెల్ఫీలు అడుగుతున్నారని,చాలా ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఆయుష్,ఐసీఎంఆర్ నివేదికలు వచ్చాక ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తామని స్పష్టం చేశారు. తన వద్ద నాటు మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారంపై ఆనందయ్య స్పందించారు.
మందు తీసుకున్నాకే కోటయ్య ఆరోగ్యం మెరుగైందని.. నీరసం వల్లే ఇప్పుడలా ఉన్నారని స్వయంగా ఆయన కూతురే చెప్పారని తెలిపారు. మీడియానే తమను ఇబ్బంది పెడుతోందని కూడా ఆమె చెప్పారన్నారు.
కొంతమంది ఆనందయ్య మందు పేరుతో దొంగతనంగా మందును విక్రయిస్తున్నారని... వారి సంగతి చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను,తన అనుచరులు క్షేమంగా ఉన్నామని వెల్లడించారు.
నాటు మందుగా గుర్తించిన ఆయుష్...
రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు నేత్రుత్వంలోని బృందం శనివారం(మే 22) నెల్లూరులో ఆనందయ్య నాటు మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆ మందును ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చాక దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రాథమిక అధ్యయనం ప్రకారం... ఆనందయ్య మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.
కాబట్టి దీన్ని వాడటం హానికారకం కాదని స్పష్టం చేశారు. అయితే ఇది ఆయుర్వేద మందు కాదని... ఆయుర్వేద ప్రోటోకాల్స్ ఇందులో పాటించడం లేదని తెలిపారు. కాబట్టి దీన్ని నాటు మందుగానే గుర్తిస్తున్నామని చెప్పారు.