ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులేయిస్తే బయటకు రాలేదు ఎందుకో ? భువనేశ్వరిపై రోజా ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టార్గెట్ గా వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పిస్తున్నారు.మొన్నటికి మొన్న చివరి దశలో తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టని భువనేశ్వరి రాజధాని రైతులకు పరమాన్నం పెడతారట అని సెటైర్లు వేసిన రోజా తాజాగా మరింత ఘాటుగా భువనేశ్వరిని విమర్శించారు .

రైతుల దీక్షకు బువనేశ్వరి మద్దతు .. రోజా ఫైర్
రాజధాని అమరావతి కోసం కొనసాగుతున్న దీక్షల్లో భాగంగా జనవరి 1వ తేదీన ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రైతుల దీక్షలో చేసిన వ్యాఖ్యలపై, అలాగే చేతిగాజులు తీసి అమరావతి పరిరక్షణా సమితికి ఇవ్వటంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టార్గెట్ గా చేసుకుని నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా మాటల దాడి చేశారు.

చంద్రబాబు చేతిలో భువనేశ్వరి రాజకీయ పావుగా మారారన్న రోజా
ఇక నేడు మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం భువనేశ్వరిని రంగంలోకి దించారని ఆరోపించారు రోజా . చంద్రబాబు చేతిలో భువనేశ్వరి రాజకీయ పావుగా మారారని ఆమె మండిపడ్డారు . ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని గుర్తు చేసిన రోజా అప్పుడు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.

తండ్రి ఎన్టీఆర్ పై భర్త చెప్పులు వేయిస్తుంటే భువనేశ్వరి బయటకు రాలేదు
ఇక అంతే కాదు నాడు తన తండ్రి ఎన్టీఆర్ పై భర్త చంద్రబాబు చెప్పులు వేయిస్తుంటే భువనేశ్వరి ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు. తన తండ్రిపై భర్త చేసిన దానికి ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. ఇక ఇప్పుడు రైతులకు సహాయం చేయడానికి భువనేశ్వరి ఎలా వచ్చారని, ప్రజలు ఆమెను ఎలా విశ్వసిస్తారని ఆమె ప్రశ్నించారు. పదవిని కోల్పోయి అసెంబ్లీ నుంచి కంటతడి పెట్టుకుంటూ ఎన్టీఆర్ వెళుతుంటే భువనేశ్వరి ఎందుకు తండ్రిని పరామర్శించలేదని నగరి ఎమ్మెల్యే రోజా భువనేశ్వరిని అడిగారు.

తోడబుట్టిన వారిని గెంటేసినా భువనేశ్వరి మాట్లాడలేదు
తోడబుట్టిన పురందేశ్వరి, హరికృష్ణలను పార్టీ నుంచి గెంటేసినంత పనిచేసినా భువనేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని రోజా భువనేశ్వరిని దుయ్యబట్టారు . రాజధాని నిర్మాణం కోసం గతంలో ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. స్కూలు పిల్లలు హుండీలు ఏర్పాటు చేస్తే భువనేశ్వరి కానీ, ఆమె కోడలు కానీ ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ రెండు గాజలు ఇస్తే ఎలా నమ్మాలని రైతులు అడుగుతున్నారని రోజా ప్రశ్నించారు..

భువనేశ్వరిపై విరుచుకుపడుతున్న రోజా
గతంలో ఎన్నడూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజకీయాల్లోకి రాలేదు. పెద్దగా మాట్లాడనూ లేదు. ఇక తాజాగా రాజధాని ప్రాంత రైతుల దీక్షలో మాత్రం ఆమె బాగానే మాట్లాడారు. దీంతో భువనేశ్వరి రాజకీయంగా రంగంలోకి దిగుతున్నారా అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే భువనేశ్వరి పై వైసీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీఐఐసి చైర్మన్ , నగరి ఎమ్మెల్యే రోజా భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications