జగన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుచరిత టిడిపిలోకి వెళ్తారా: భావోద్వేగంతో ఇలా..
తాను టిడిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే సుచరిత ఖండించారు. ఈ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
గుంటూరు: తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతన్న ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యురాలు ఎం. సుచరిత ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
గుంటూరు - ప్రత్తిపాడు రోడ్డు వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట 5వ మైలు పత్తి మిల్లు ఆవరణలో సోమవారం నియోజకవర్గ వైసీపీ ప్లీనరి సమావేశం జరిగింది. ప్లీనరికి అధ్యక్షత వహించిన సుచరిత భావోద్వేగంతో ప్రసంగించారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపు వాగ్దానాలు చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లు మంగళగిరి శాసన సభ్యుడు రామకృష్ణారెడ్డి అన్నారు. బాపట్ల శాసన సభ్యుడు కోనా రఘుపతి కూడా మాట్లాడారు.ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఆయన చెప్పారు. తాను టీడీపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రతిపాదించినట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు.
ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. సమావేశానికి ముందు గుంటూరు నుంచి కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీతో ప్లీనరికి తరలివచ్చారు. ప్లీనరి పరిశీలకుడు అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ, ఆతుకూరి ఆంజనేయులు, మేరువ నాగార్జున, లాల్పురం రాము, క్రిష్టినా, డైమండ్ బాబు, కాకుమాను రామకృష్ణ, ప్రత్తిపాడు ఇన్చార్జ్ సంజీవరెడ్డి, ఆళ్ల వెంకటరాజు, జిలాని, మండేపూడి పురుషోత్తం, చిన్నపరెడ్డి, పూర్ణ చంద్రరావు, భీమినేని విశ్వేశ్వరరావు, వట్టిచెరుకూరు మండలం వైసీపీ కన్వీనర్ మన్నవ వీర నారాయణ, తదితరులు ప్రసంగించారు.