ఏపీలో వచ్చే 48 గంటల పాటు..!!
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిస్తాయని అంచనావేసింది.

భారీ వర్షాల ప్రభావం తగ్గిన నేపథ్యంలో అటు గోదావరికి వరద స్థిరంగా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 36.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 15.9 మీటర్లుగా రికార్డయింది. పోలవరం వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ గోదావరి నది నీటిమట్టం 11.39 మీటర్లు.
అటు ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఇన్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తోన్నారు. అవుట్ ఫ్లో కూడా 5.57 లక్షల క్యూసెక్కులుగా రికార్డయింది.
గోదావరి, తుంగభద్ర, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వివిధ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక/లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications