మోడీ జ్వరంతో, చిరు గోడు: టిపై వెంకయ్య, జైరాంపై ఫైర్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ భయం, జ్వరం పట్టుకుందని, అందుకే తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. ప్రధానికి ఇళ్లు చూసే శ్రద్దను ప్రజల సమస్యల పైన పెట్టడం లేదన్నారు. తెలంగాణపై చర్చలో ప్రధాని, సోనియా, రాహుల్లు ఎవరు పాల్గొనలేదని విమర్శించారు.
కాంగ్రెసు పార్టీవి అన్నీ చవకబారు రాజకీయాలన్నారు. బిల్లుపై రాజ్యసభలో ఎవరు మాట్లాడారో దేశ ప్రజలు చూశారన్నారు. సీమాంధ్రలో ప్రత్యేక ప్రతిపత్తిపై తాము సభలో పోరాడటం వల్లే కాంగ్రెసు పార్టీ తగ్గిందన్నారు. తాము పోరాడకుంటే ప్రత్యేక ప్రతిపత్తి పైన దృష్టి సారించకపోయి ఉండేదన్నారు. దేశంలో ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయన్నారు. కాంగ్రెసు బిల్లు విషయంలో ఎవరిని పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెసు పార్టీ.. తెలంగాణలోనేమో తాము రాష్ట్రమిచ్చామని, సీమాంధ్రలోనే బిజెపి వల్ల ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారని, ఇదేం ద్వంద్వ వైఖరి అన్నారు. కిరణ్ రెడ్డి ఎవరని జైరామ్ రమేష్ అడగడం విడ్డూరమన్నారు. ఈరోజు హూ ఈజ్ కిరణ్ అన్న జైరామ్.. రేపు హూ ఈజ్ సోనియా, హూ ఈజ్ మన్మోహన్ అంటారన్నారు. తెలుగు వాళ్లను కించపరిస్తే ఏం జరుగుతుందో కాంగ్రెసుకు తెలుసునన్నారు. ప్రత్యేక హోదా క్రెడిట్ బిజెపికి దక్కుతుందనే జైరాం సీమాంధ్రలో పర్యటిస్తున్నారని ఆరోపించారు.
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ సొంత పార్టీ మంత్రులు, నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదనలు పట్టించుకోలేదన్నారు. తనను పట్టించుకోవడం లేదని చిరంజీవి పార్లమెంటులో గోడు వెల్లబోసుకున్నారని, కెసిఆర్ కూడా తమ ప్రతిపాదలను పట్టించుకోలేదని చెప్పారన్నారు. టేబుల్ ఐటంగా పెట్టారని కేంద్రమంత్రులు స్వయంగా చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాక జైరామ్ రమేష్.. తాను తెలంగాణకు వ్యతిరేకమని చెబుతున్నారని, ఆయన ఆంధ్రా ఎంపీ కాబట్టి అలా చెప్పారన్నారు.
మరో ఇద్దరు మంత్రులు కూడా అదే చెప్పారని, త్వరలో వారెవరో చెబుతామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్రకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అందుకే దానిని తెలంగాణకే ఇవ్వాలని చెప్పామన్నారు. ఆంధ్రా ప్రజల పట్ట కాంగ్రెసుకు మొదటి నుండి చిన్నచూపే అన్నారు. కిరణ్ విధేయుడని దిగ్విజయ్ చెబుతుంటే, జైరామ్ మాత్రం ఎవరని అడుగుతారని ప్రశ్నించారు. తాము అడగకుంటే సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి వచ్చి ఉండేది కాదన్నారు.
ప్రత్యేక ప్రతిపత్తిపై సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెసు ఎంపీలు ఎప్పుడు అడిగారని ప్రశ్నించారు. తాము తెలంగాణకు ఒప్పుకొని, సీమాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడామన్నారు. రానున్న ఎన్నికల్లో తామే గెలుస్తామని, సీమాంధ్రను అబివృద్ధి చేస్తామన్నారు. తమ సూచనలు పట్టించుకోలేదని చిరు, కెసిఆర్, కిరణ్, కేంద్రమంత్రులు... ఇలా అందరు చెబుతున్నారన్నారు. తన గోడు వినిపించుకోవడం లేదని చిరు పార్లమెంటులో చెప్పారన్నారు. మోడీ భయం, మోడీ జ్వరంతోనే కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందన్నారు.
తాము తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లుకు మద్దతు పలికామన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. తాము మొదటి నుండి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మోడీ భయం కారణంగా గత్యంతరం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీయే బిల్లు పెట్టిందన్నారు. ఓటు కోసం.. సీటు కోసం కాకుండా మాట కోసం బిజెపి నిలబడిందన్నారు.
చిరుకు సామర్థ్యం లేదా?
జివోఎంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు ఎందుకు లేరని వెంకయ్య ప్రశ్నించారు. చిరంజీవి, జైపాల్ రెడ్డి, బలరాం నాయక్ వంటి వారికి సామర్థ్యం లేదా అన్నారు. కాంగ్రెసు పార్టీ డిక్షనరీలో కన్సల్ట్ అనే పదం లేదని, ఇన్సల్ట్ ఉందన్నారు.