పక్క రాష్ట్రంలా: చంద్రబాబును మోడీ చిక్కుల్లోకి నెడుతున్నారా?
న్యూఢిల్లీ/అమరావతి: ఏపీకి సరైన నిధులను కేటాయించకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ, ప్రధాని మోడీ కార్నర్ చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి అవసరమైన మేర సాయం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతుండగా, నిధులు సరిగా రావడం లేదని టిడిపి చెబుతోంది. రాజధానికి రెండు వేల కోట్లకు రూపాయలకు పైగా ఇచ్చామని, వివిధ సంస్థలు ఏర్పాటు చేశామని, పలు అంశాల్లో పన్ను రాయితీ ఇచ్చామని చెబుతున్నారు.
అయితే, టీడీపీ నేతలు మాత్రం దానితో ఏకీభవించడం లేదు. సంస్థలు ఇచ్చారని, నిధులు ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే, విభజన ద్వారా నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన రీతిలో ఆదుకోవడం లేదనేది టీడీపీ వాదనగా ఉంది.
'ఏపీకి తీవ్ర నిరాశ, హోదాపై క్లారిటీ ఇవ్వని జైట్లీ, మరింత గందరగోళం'
తమిళనాడు, కర్నాటకల్లాగే చూస్తోందా?
విభజన ద్వారా నష్టపోయిన ఏపీకి ఆ రీతిలో కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, ఉదారత చూపించడం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో సమానంగానే చూస్తున్నారని అంటున్నారు.
తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలలాగే (అక్కడ బీజేపీ విపక్షం, లేదా వ్యతిరేక పక్షం) తమను ట్రీట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రాష్ట్రమైనందున ఏపీకి పెట్టుబడుల రాబట్టేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అప్పుడే పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. అయితే, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు.. తమ వద్ద నుంచి పరిశ్రమలు వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రత్యేక హోదాకు నో చెబుతున్నాయి.
రాజ్యసభలో హోదా: వెంకయ్యపై సీఎం అసహనం, పోరాడి ఓడామని సుజన
నాలుగు రెట్ల నిధులు ఆశిస్తే..
ఏపీకి కేంద్రం గత రెండేళ్లలో రూ.13వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఇంతకు నాలుగు రెట్లు వస్తాయని ఆశించారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ వచ్చి శుభవార్త చెబుతారనుకుంటే, కేవలం మట్టి, నీరు తెచ్చి ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఏపీకి కేంద్రం నుంచి బాగానే సహకారం లభిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, కొందరు నేతలు మాట్లాడుతూ.. మిత్రపక్షం అధికారంలో ఉందని ఎక్కువ నిధులు ఇవ్వలేమని, ఇతర రాష్ట్రాలతో వేరుగా చూడలేమని, ఏపీ కొత్త రాష్ట్రం కాబట్టి ఆ మేరకు ఆదుకుంటామని చెబుతున్నారు.
రాజధానికి రూ.2050 కోట్లు ఇచ్చామని, పన్ను రాయితీలు ఇచ్చామని చెబుతున్నారు. అయితే, 2019 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీకి ఝలక్ ఇస్తోందనే వారు కూడా ఉన్నారు.