చంద్రబాబుతో మోడీ మంతనాలు: పవన్ కల్యాణ్ కట్టడికి ప్లాన్?
తమపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్కు గట్టి సమాధానం చెప్పడానికి మోడీ సిద్దపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
విజయవాడ: దక్షిణ భారతదేశం పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు మూయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పవన్ కల్యాణ్ తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాను కాలికి బలపం కట్టుకుని తిరిగి బిజెపి, తెలుగుదేశం పార్టీలను ఆంధ్రప్రదేశ్లో గెలిపించానని పవన్ కల్యాణ్ పదే పదే చెప్పుకుంటున్నారు. నిజం అదే కావచ్చు గానీ, ఇది అటు తెలుగుదేశం పార్టీకి గానీ బిజెపికి గానీ రుచించడం లేదు. పవన్ కల్యాణ్ను ఎలా కట్టడి చేయాలనే విషయంపై ఇరు పార్టీల పెద్దలు సుదీర్ష ఆలోచనలే చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా, పవన్ కల్యాణ్ లేవనెత్తిన దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష అనేది కొత్త కుంపటిగానే తయారైంది. దీంతో పవన్ కల్యాణ్ను కట్టడి చేయకతప్పదనే అభిప్రాయానికి మోడీ కూడా వచ్చారని అంటున్నారు.
ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్...
కేంద్ర ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సమరం ప్రకటించారు. ప్రత్యేక హోదాపైన ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బిజెపి నేతలు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు చెబుతారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆయన దక్షిణాది పట్ల వివక్ష అనే నినాదాన్ని ఎత్తుకుని ట్విట్టర్లో వరుసగా బిజెపిపై, కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.
హిందీ భాషపై పవన్ కల్యాణ్....
హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడుతున్నారు. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశ చరిత్రను బిజెపి తిరగ రాసే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో పవన్ కల్యాణ్ దూకుడుకు కళ్లెం వేయాలని మోడీ గట్టి నిర్ణయమే తీసుకున్నారనే మాట వినిపిస్తోంది.
చంద్రబాబుతో మోడీ మంతనాలు...
పవన్ కల్యాణ్ దూకుడు కళ్లెం వేసేందుకు ప్రధాని మోడీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. దక్షిణాది భాషల్లో ఒక్కదాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠశాలల్లో సిలబస్గా పెడితే ఎలా ఉంటుందనే విషయంపై వారిరువురి మధ్య చర్చలు సాగినట్లు చెబుతున్నారు. దేశ సమగ్రతను పెంచడానికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది, దానివల్ల సంభవించే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై చర్చ సాగినట్లు చెబుతున్నారు.
తెలుగు భాషకు అది దక్కుతుందా...
ఉత్తరాది రాష్ట్రాల్లోని పాఠశాలల్లో తెలుగు భాషను అభ్యసించడాన్ని ప్రవేశపెడుతారా అనే చర్చ కూడా సాగుతోంది. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు కావడం విశేషం. దక్షిణాది భాషల్లో తెలుగు 7.14 శాతం, తమిళం 5.91 శాతం, కన్నడం 3.69 శాతం, మలయాళం 3.21 శాతం ప్రజలు మాట్లాడుతారు. ఈ స్థితిలో తెలుగుకు ఆ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మోడీ చేస్తున్నట్లు వినికిడి.