కరోనా : ఏపీలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు.. డాక్టర్ల రిక్రూట్మెంట్కు ప్రభుత్వ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 7గం. నుంచి గురువారం ఉదయం 9గం. వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లాలో 3,కర్నూలు జిల్లాలో 3,పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులెటిన్లో వెల్లడించారు.

దశలవారీగా అనుమానితులకు వైద్య పరీక్షలు..
కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 534 కి చేరింది. ఇప్పటివరకూ 14 మంది మృత్యువాత పడగా.. 20 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 500 యాక్టివ్ కేసులకు చికిత్స జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 11,613 శాంపిళ్లను టెస్ట్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే మూడు విడుతలుగా నిర్వహించిన సర్వేలో 32వేల అనుమానితులను గుర్తించారు. వారందరికీ దశలవారీగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

డాక్టర్ల కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్..
మరోవైపు కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద డాక్టర్ల రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు,జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టులు,జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను ఏడాది కాల పరిమితితో కాంట్రాక్ట్ పద్దతిలో రిక్రూట్ చేసుకునేందుకు దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. స్పెషలిస్టులకు రూ.1,10,000 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు రూ.53,945 జీతభత్యాలుగా నిర్ణయించింది.

ఆందోళన అవసరం లేదంటున్న ప్రభుత్వం
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తగిన సంఖ్యలో పీపీఈలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్వారెంటైన్ కేంద్రాల నుంచి డిశ్చార్జి అయ్యేవారికి రూ.2వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులు,ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications