తడాఖా చూపిన సువేందు: తృణమూల్ మాజీమంత్రి అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో ఊహించిందే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి తడాఖా చూపుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. తాము అధికారంలోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ లోని అవినీతిపరులందరినీ అరెస్ట్ చేయిస్తానంటూ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట కూడా నిలుపుకొంటోందక్కడి బీజేపీ సర్కార్.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. విచారణలో భాగంగా వెల్లడైన కీలక ఆధారాల మేరకు ఈ చర్య తీసుకుంది. కోల్ కత దక్షిణ డమ్ డమ్ మునిసిపాలిటీలో 150 మంది అభ్యర్థులకు సుజిత్ బోస్ అక్రమంగా సిఫార్సులు చేసి వారి నుంచి డబ్బులు తీసుకున్నారనేది ఆరోపణ. ఉద్యోగ నియామకాల సహాయంతో ఆయన పలు ఫ్లాట్లను స్వీకరించారని, దీన్ని నేర కార్యకలాపాల ద్వారా ఆర్జించిన ఆస్తులుగా ఈడీ నిర్ధారించింది.

ఈ సిఫారసుల ద్వారా సుజిత్ బోస్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు జమ అయినట్లు కూడా ఆధారాలు సేకరించింది. సుజిత్ బోస్ను ఈ ఉదయం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీకి కోరనున్నారు. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 10న ఈడీ పశ్చిమ బెంగాల్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సుజిత్ బోస్ కార్యాలయంతో పాటు ఆయన నిర్వహించిన అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రిత్వ కార్యాలయాల నుంచీ కీలక పత్రాలు, రూ. 45 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది.
సుజిత్ బోస్ అరెస్టుకు దారితీసిన ఈ కేసు పశ్చిమ బెంగాల్లోని పలు మునిసిపాలిటీలు, నగరపాలికలలో జరిగిన అక్రమ నియామకాల కుంభకోణానికి సంబంధించినది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. కంచారాపారా, న్యూ బ్యారక్పూర్, కమర్హాటి, టిటాగఢ్, బారానగర్, అలిషెహర్, సౌత్ డమ్డమ్, డమ్డమ్ వంటి అనేక మునిసిపాలిటీలలో అక్రమ నియామకాలు జరిగాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి.
ఆయా మున్సిపాలిటీల్లో మజ్దూర్, స్వీపర్, క్లర్క్, ప్యూన్, అంబులెన్స్ అటెండెంట్, పంప్ ఆపరేటర్, హెల్పర్, డ్రైవర్ తదితర పలు పోస్టుల్లో ఈ అక్రమ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీల పరీక్షా సంబంధిత కాంట్రాక్టులు ఏబీఎస్ ఇన్ఫోజోన్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు అప్పట్లో. ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, మూల్యాంకనం, మెరిట్ జాబితా తయారీ బాధ్యతలు ఈ సంస్థకే ఇచ్చారు.
అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశ్యంతో ఆ సంస్థ అధినేత అయన్ కు చెందిన అధికారిక సీల్, ఇతర ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు జరిపి డబ్బులకు బదులుగా ఉద్యోగాలు కల్పించినట్లు దర్యాప్తులో తేలింది. అయన్ సీల్పై ఈడీ ఇప్పటికే కోల్కతాలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications