హనీరోజ్ మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ సభల కంటే ఎక్కువ మంది వస్తారట!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రను గోదావరి జిల్లాలలో పూర్తి చేశారు. జనంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో అశేష సంఖ్యలో జనం పాల్గొన్నారు. పవన్ అభిమానులు అడుగడుగునా పవన్ కళ్యాణ్ కు నీరాజనాలు పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతీ చోట జన సంద్రంలా వారాహి విజయయాత్ర కనిపించింది.
అయితే అదంతా ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మారదని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వారాహి విజయ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో వైసీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది.

ఇక ఆయనకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు పవన్ రాజకీయ జీవితం తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పైన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ సభలకు వచ్చిన వారంతా ఆయనను చూడడానికి వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేగాని వారాహి యాత్రలో కనిపించేవారు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే ముందు స్థిరత్వం కావాలని ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.
నటి హనీ రోజ్ ను బహిరంగ సభకు పిలిస్తే వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రజా బలం కంటే ఎక్కువ జన బలం ఉంటుందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. దేశంలో ఉన్న ప్రజలు ఏ కొత్త పార్టీ అయినా స్వాగతిస్తారని పేర్కొన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇతర పార్టీల కోసం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ లాగా కాకుండా సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.

ప్రజలు తమ అభిమాన తారలకు ఓటు వేస్తే సినీ తారలు అందరూ అధికారంలో ఉండే వారని పేర్కొన్నారు. చాలా మంచి వారైనా చిరంజీవి కూడా పాలకొల్లులో ఓడిపోయానని గుర్తు చేశారు. ఏ సినిమా స్టార్ అయినా మొదటిసారి గెలుస్తారని రెండోసారి గెలిచిన దాఖలాలు లేవని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు 7 సార్లు గెలిచారు అంటే దొంగ ఓట్ల వల్లే గెలిచాడని ఆయన ఆరోపించారు. కుప్పంలో పూర్తిస్థాయిలో దొంగఓట్లను తొలగిస్తే చంద్రబాబు గెలుపు ప్రశ్నార్థకం అవుతుందని ఆయన అన్నారు. బాలకృష్ణ తెలివైన వాడిని, సొంత ఊరిలో పోటీ చేస్తే ఓడిపోయి ఉండేవాడని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications