సీపీఎస్ పై దారేది ? జగన్ సర్కార్ మథనం-నేడు విద్రోహం దినం పేరుతో ఉద్యోగుల నిరసనలు
ఏపీలో ఉద్యోగుల సీపీఎస్ రద్దు డిమాండ్ పై ప్రభుత్వం ఇరుకునపడుతోంది. స్వయంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీపై ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్ధితి లేకపోవడంతో ఉద్యోగులకు సమాధానం చెప్పుకోవడం కష్టంగా మారింది. జగన్ సర్కార్ సీపీఎస్ కు బదులుగా సూచిస్తున్న ప్రత్యామ్నాయాల్ని ఉద్యోగులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదే అదనుగా ఉద్యోగులు వరుస ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
సీపీఎస్ రద్దయ్యేనా ?
ఏపీలో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కోసం వైసీపీ అధినేతగా జగన్ గతంలో పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దీన్ని అమలు చేసేందుకు మూడేళ్లు సమయం తీసుకున్నారు. అనంతరం ఉద్యోగుల ఒత్తిడి తాళలేక చర్చలు మొదలుపెట్టారు. సీఎస్, మంత్రులతో కమిటీలు వేసి చర్చలు జరిపారు. చివరికి సీపీఎస్ రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ప్రత్యామ్నాయాల్ని తెరపైకి తెచ్చినా ఉద్యోగులు అంగీకరించలేదు. చివరికి ఉద్యోగులకు ఏం చెప్పాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో రద్దవుతున్న సీపీఎస్ ఏపీలో మాత్రమే ఎందుకు రద్దు కావడం లేదనే అంశంపై ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు.
మిలియన్ మార్చ్ వాయిదా
సీపీఎస్ రద్దుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు వాస్తవానికి ఇవాళ మిలియన్ మార్చ్ పేరుతో విజయవాడలో భారీ సమావేశం నిర్వహించాలని భావించారు. కానీ ప్రభుత్వం ఉద్యోగుల్ని అరెస్టులు, బైండోవర్లు, కేసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆగస్టు 31న పండుగ కూడా రావడంతో ఉద్యోగులు తప్పనిసరి పరిస్ధితుల్లో తమ ఛలో విజయవాడను సెప్టెంబర్ 11కు వాయిదా వేసుకున్నారు. అయినా ప్రభుత్వం కేసులు, అరెస్టులతో ఉద్యోగుల్ని వేధిస్తోందని ఉద్యోగ నేతలు ఆరోపిస్తున్నారు.
నేడు విద్రోహ దినం నిరసనలు
సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల్ని అరెస్టులు, కేసుల పేరుతో ప్రభుత్వం వేధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఇవాళ బ్లాక్ డే(విద్రోహ దినం)గా పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని, సీపీఎస్ రద్దయే వరకూ ఈ ఆందోళనలు కొనసాగించాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళనలకు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా మద్దతిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పాలనపైనా తీవ్ర ప్రభావం పడబోతోంది.
విపక్షాలకు ఛాన్స్ ?
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాల్ని ప్రభుత్వం ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తుండటంతో ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే ఉద్యోగుల అరెస్టుల్ని, కేసులతో భయపెట్టడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవాళ కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకూ విపక్షాలు మద్దతిస్తున్నాయి. ఈ నిరసనలు మరింత పెరిగితే విపక్షాలకు రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వం ఏం చేయగలుగుతుందన్న దానిపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. అసలే ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వానికి విపక్షాల ఆందోళనలు తలనొప్పిగా మారాయి. వీటిని విపక్షాలు రాజకీయంగా వాడుకుంటే మాత్రం మరిన్ని ఇబ్బందులు తప్పవు.