జగన్పై 75శాతంమంది డైలమా: సబ్బం, పండుగ: టిడిపి
హైదరాబాద్/విశాఖ: మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది డైలమాలో ఉన్నారని చెప్పారు. రాజకీయ అనిశ్చితి సమయంలో వారు జగన్ పార్టీ నుండి గెలిచారు తప్ప నాయకుడిగా జగన్ పైన పూర్తిస్థాయి నమ్మకం వారికి లేదన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ నాయకుడిగా ప్రేమతో వారు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి కారణం జగనే అన్నారు. నాయకులు, కార్యకర్తలతో జగన్ వైఖరి ఓటమికి కారణమన్నారు.

పండుగ చేసుకుందాం: మోత్కుపల్లి
జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రజలమంతా పండుగ చేసుకుందామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు చేస్తామని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్న జూన్ 2న పవిత్ర దినమని, అలాంటి రోజున కొత్త ప్రభుత్వం హామీల అమలు పైన ప్రకటన చేయాలని రావుల చెప్పారు.












Click it and Unblock the Notifications