మోత్కుపల్లి, సోమిరెడ్డి అసంతృప్తి: హరికృష్ణ ఏంచేస్తారు?

ఈ భేటీలో పలువురి పేర్లు చర్చకు వచ్చిన చివరకు గరికపాటి, సీతారామలక్ష్మిలకు అవకాశం ఇచ్చారు. దీంతో రాజ్యసభపై ఆశలు పెట్టుకున్న మోత్కుపల్లి, సోమిరెడ్డిలు అలక వహించారు. ఓ సమయంలో మోత్కుపల్లి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నామా నాగేశ్వర రావు, ఎర్రబెల్లి దయాకర రావులు ఆయనను బుజ్జగించి లోపలకు తీసుకెళ్లారు. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కోవాలన్నా, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవాలన్న మోత్కుపల్లిని రాజ్యసభకు పంపించాలని పలువురు చెబుతూ వచ్చారు. మోత్కుపల్లి కూడా బాబు వద్ద ఇదే చెప్పినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు నివాసం నుంచి సోమవారం అర్ధరాత్రి బయటకు వచ్చిన సమయంలో కూడా మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహంతోనే కనిపించారు. తనకు రాజ్యసభ సీటు కావాలని ఆయన చాలా కాలంగా పార్టీ నాయకత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ మేరకు చంద్రబాబు తనకు హామీ కూడా ఇచ్చారన్నది ఆయన వాదన. కానీ, చివరకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయి.
ఇక, సోమిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన సోమిరెడ్డి ఆ తర్వాత బాబు వ్యక్తిగతంగా నేతలతో చర్చించగా వెళ్లేందుకు నిరాకరించారు. తాను జిల్లాలో పార్టీని అనేక ఏళ్లుగా మోస్తూ ఎంతో శ్రమించినా తనకు అవకాశం రాలేదని, ఈ పరిణామం బాధ కలిగించిందని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. తనకు అవకాశం రానందుకు హతాశులైన నేతల్లో కంభంపాటి రామ్మోహన రావు కూడా ఉన్నారు.
మరోవైపు సీనియర్ నేత నందమూరి హరికృష్ణకు రాజ్యసభను ఇవ్వలేనని చంద్రబాబు భేటీలోనే చెప్పడంతో ఆయన అలిగి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ సభ సీటు కావాలని తనకు ఆఖరి నిమిషంలో చెబితే ఏం చేయగలనని, ముందుగా చెబితే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారట. కాగా తనను ఎంపిక చేయకపోవడంపై హరికృష్ణ బాధపడ్డారు. తనకు ఈ నిర్ణయం బాధ కలిగించిందని ఆయన తర్వాత కొందరు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారనే ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications