ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్, విడుదల - సీబీఐ నిర్ణయం వెనుక..!!
వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ వెంటనే కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. అనంతరం ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చి.. ఏ-8గా పేర్కొంది. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ అరెస్టు విషయాన్ని ప్రకటించకుండా గోప్యంగా వ్యవహరించింది. సుప్రీంలో అవినాశ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించనుంది.
ఏ-8గా అవినాశ్ ను పేర్కొన్న సీబీఐ:
వివేకా కేసులో భాస్కర్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటివరకు ఆయన్ను సహనిందితుడిగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ.. ఈ కౌంటర్లో మాత్రం ఏ-8గా పేర్కొంది. సాంకేతికంగా ఆయన్ను అరెస్టు చేసిన తర్వాతే ఏ-8గా చూపినట్లు సమాచారం. మరోవైపు.. భాస్కర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని కొట్టేయాలని కోర్టును అభ్యర్థించింది. వివేకా హత్యకు సంబంధించిన కుట్ర, ఆధారాల చెరిపివేతలో తండ్రీకొడుకులు కీలక పాత్ర పోషించారని అఫిడవిట్లో తెలిపింది. కీలక దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత దశలో ఆయనకు బెయిల్ ఇస్తే ప్రాసిక్యూషన్ కేసు దెబ్బతింటుందిని సీబీఐ వాదించింది.

అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి:
భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు అందజేశారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్షులు తీవ్రంగా ప్రభావితమవుతారని..
విస్తృత కుట్రలో భాస్కర్రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఉదయ్కుమార్రెడ్డి, భాస్కర్రెడ్డి గురువారం సీబీఐ కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యారు. వీరికి ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక, ఎంపీ అవినాశ్ ఏడు సార్లు సీబీఐ ముందు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. వముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ తరువాత షరతులతో కూడిన ముందస్తు బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది.
అవినాశ్ అరెస్ట్..విడుదల వెనుక:అవినాశ్ ను అరెస్ట్ చేయాల్సి వస్తే సీబీఐ సంతృప్తి మేరకు తగిన మొత్తానికి రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది. అదే విధంగా అవినాశ్ ప్రతి శనివారం సీబీఐ ఎదుట ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు హాజరుకావాలని పేర్కొంది. అవినాశ్ అరెస్ట్..విడుదల వ్యవహారాన్ని భవిష్యత్ లో న్యాయస్థానాల విచారణ..తదుపరి చర్యల కోసం సీబీఐ సాంకేతిక అంశాన్ని పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేయటం.. విడదల చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఈ నెల 3న (శనివారం) అవినాశ్రెడ్డి విచారణకు వచ్చినప్పుడు అరెస్టు చేసి, హైకోర్టు ఆదేశించిన మేరకు పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. అలాగే అవినాశ్రెడ్డిని 8వ నిందితుడిగా (ఏ-8) చేరుస్తూ సీబీఐ తీసుకున్ననిర్ణయం కీలకంగా మారుతోంది. ఇక అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని సప్రీంలో సునీత పిటీషన్ విచారణ జరగనుంది. అటు భాస్కర రెడ్డి బెయిల్ పిటీషన్ పైన ఈ రోజు (శుక్రవారం) కోర్టు తీర్పు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications