కఠిన శిల, ప్రేమంటే..?: మోడీపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు, జగన్కు సవాల్, గాంధీ బాటలో టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. ఆదివారం ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే.
తాజా, సోమవారం మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు టీడీపీ ఎంపీలు. సోమవారం ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్ఘాట్కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Recommended Video

విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించకూడదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామన్నారు.

పోరాటం ఆపేది లేదు
ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేవరకు పోరుబాట విడిచేది లేదని సుజనా స్పష్టం చేశారు.

కేంద్రం ముందుకు రావడం లేదు
విభజన హామీలు నెరవేర్చమని అడిగినా.. కేంద్రం ముందుకు రావడం లేదని సుజనా చౌదరి ఆరోపించారు. అందుకే అవిశ్వాసం పెట్టామని.. అయితే, స్వీకర్ ఏవో సాకులు చెబుతూ సభలో చర్చ జరగకుండా వాయిదా వేశారని అన్నారు. స్పీకర్ రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక పార్టీకి చెందిన వారిలా వ్యవహరిస్తున్నారని సుజనా అన్నారు.

గొప్పగా ఇస్తామని..
తాము మహాత్మాగాంధీ చూపిన శాంతియుత బాటలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ.. గాంధీని స్ఫూర్తిగా తీసుకుని పాలన కొనసాగించాలని అన్నారు. హోదా కంటే గొప్పగా ఇస్తామని చెప్పి.. ఏపీ ప్రజలను మోసం చేశారని కేంద్రంపై మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డికి జేసీ సవాల్
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయించామని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో ఉన్న ఇద్దరు ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సవాల్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు పోరాడతారని గతంలో జగన్ అన్నారని.. మరిప్పుడు వారితో రాజీనామాలు చేయించడానికి కారణమేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామాలతో ఎలాంటి ప్రయోజం లేదన్నారు. అవసరం అనుకుంటే తాము నిమిషాల్లో రాజీనామా చేస్తామని జేసీ చెప్పారు.

మోడీ కఠినశిలా.. ప్రేమంటే.??
తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రధాని నరేంద్ర మోడీ గుండె కరిగేలా లేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనను ఓ కఠిన శిలగా జేసీ అభివర్ణించారు.
మోడీకి స్పందించే గుణం లేదని, అతనికి ప్రేమంటే తెలియదని.. ఆ పద్ధతిలో పెరగలేదని ఆరోపించారు. అమ్మను ఓకాడా.. ఇంకో ఆమెను మరోకాడా ఉంచారని వ్యాఖ్యానించారు. ప్రేమను పంచుతూ.. స్వీకరించాలని కోరారు. ఎవరైనా అనాథ పిల్లలను పెంచుకుంటే ప్రేమంటే తెలుస్తుందని అన్నారు.

అమిత్ షా జాతి ఏంటో..
కాగా, విపక్షాలను జంతువులతో పోల్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపైనా జేసీ తీవ్రంగా స్పందించారు. ఆయన కూడా ఆ జాతికి వస్తారని అన్నారు. మొదట అమిత్ షా తన జాతి ఏమిటో చెబితే.. తాము ఎంటో చెబుతామని జేసీ అన్నారు.












Click it and Unblock the Notifications