మళ్లీ మధ్యలోనే వెళ్లిపోయిన మాగంటి..! సీఎం సెక్యూరిటీ అడ్డుకోవడంతో
ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు అడుగుపెట్టినా.. ఆయా కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్న ఎంపీ మాగంటి బాబు ఏదో ఒక గొడవ కారణంగా కార్యక్రమం మధ్యలోంచే వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా సీఎం సిబ్బంధి తీరుతో అసంతృప్తికి లోనైన ఆయన మరోసారి అలకబూనిట్టుగా తెలుస్తోంది.
బుధవారం నాడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్బంగా ఎంపీ మాగంటి బాబు కూడా హాజరయ్యారు. అయితే సీఎం కాన్వాయ్ కన్నా ముందు వెళ్తున్న మాగంటి వాహానాన్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంధి అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంధి తీరుకు అసంతృప్తికి లోనైన మాగంటి, మధ్యలోనే వెళ్లిపోయారు. డ్రైవర్ ను సైతం పక్కనబెట్టి తానే స్వయంగా కారు నడిపించుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించారు.
గతంలోను మాగంటి బాబు పలు కార్యక్రమాల మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. గత ఏప్రిల్ లో సీఎం చంద్రబాబు జిల్లాకు పర్యటనకు వచ్చిన సందర్బంలోను మాగంటి అలకబూనారు. సీఎం కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయన, తానే స్వయంగా వేదిక మీదకు వెళ్లి స్థానిక ఎంపీపీలను, జెడ్పీటీసీలను వేదిక మీదకు రావాల్సిందిగా కోరారు.
అయితే అక్కడే ఉన్న పోలీసు అధికారులు మాగంటికి అభ్యంతరం చెప్పడంతో, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వేదిక ఎక్కలేదు. ప్రోటోకాల్ నిబంధనలతో పోలీసులు మాగంటికి అభ్యంతరం చెప్పగా.. వాళ్లను వేదిక మీదకు పంపించాలంటూ మాగంటి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో అసంతృప్తికి లోనైన మాగంటి అక్కడి నుంచి వెళ్లిపోయారు.