ఆ టీడీపీ కార్యకర్తకు రూ.91,775ల లబ్ది: జగన్ ప్రభుత్వ లక్ష్యం అంటే ఇదే..!!
అమరావతి: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకున్న ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. స్థానిక శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఎదురైన చేదు అనుభవం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వ లక్ష్యాలేమిటో సాయిరెడ్డి పునరుద్ఘాటించారు.
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ జెండాను తన ఇంటి మీద ఎగురవేసిన కొండన్న గారి శివయ్య అనే కార్యకర్త ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన బ్రోచర్ను అందజేయబోగా, దాన్ని తీసుకోవడానికి శివయ్య నిరాకరించాడు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల తమకు అవసరం లేదని అని తేల్చి చెప్పాడు.

ఈ ఉదంతంపై విజయసాయి రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే గడప గడపకు వస్తోండటంతో ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల పరుషంగా మాట్లాడిన కొండన్నగారి శివయ్యకు- తమ ఈ మూడు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో 90 వేల రూపాయలకు పైగా సంక్షేమ పథకాల లబ్ది అందిందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను సాయిరెడ్డి తన ట్వీట్కు జత చేశారు.
కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గం చూడకుండా ప్రజలందరికీ లబ్ది కలిగించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఉన్నారని గుర్తు చేశారు. అందరి సంక్షేమమే జగన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జగనన్న విద్యాదీవెన- రూ.10,000, వైఎస్సార్ రైతు భరోసా-రూ.40,500, జగనన్న వసతి దీవెన- రూ.10,000, రైతులకు చెల్లించే వైఎస్సార్ సున్నా వడ్డీ-రూ.4,121, డ్వాక్రా గ్రూపులకు అందజేసే వైఎస్సార్ సున్నా వడ్డీ-రూ.2,900, వైఎస్సార్ ఆసరా-రూ.22,802 రూపాయలను టీడీపీ కార్యకర్త శివయ్యకు అందాయని చెప్పారు.












Click it and Unblock the Notifications