జగన్ పార్టీకి రాజీనామా: ప్రత్యేక రాయలసీమ పోరుకు మైసురా రెడీ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమానికి పాదులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ప్రత్యేక స్వరం వినిపిస్తున్న నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆయన నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం మైసూరా నివాసంలో రాయలసీమకు చెందిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీకాంత్రెడ్డి, శైలజానాథ్, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితిని ఆయన ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో 20న మైసూరా వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. 9 అంశాలతో సీమ సాధన సమితి తెరపైకి వస్తున్నట్లు సమాచారం. నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాలని ఈ సమితి నిర్ణయించింది.

కోస్తా జిల్లాలకు చేస్తున్న లబ్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని నేతలు తెలిపారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మైసురా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనకు శ్రీకారం చుడుతుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితిని ఇప్పటికే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications