బ్రిటీష్ ఆంక్షలా ? పవన్ విశాఖ నిర్బంధానికి కొనసాగింపే-జగన్ సభలేంటి ? నాదెండ్ల కామెంట్స్
ఏపీలో ర్యాలీలు, సభల్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జనసేన మండిపడింది. వైసీపీ ప్రభుత్వ చర్యపై జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ఇవాళ తీవ్రంగా ఆక్షేపించారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్థరాత్రి వేళ హడావిడిగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైసీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టుకొందని ఆయన విమర్శించారు.
వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోందని, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని నాదెండ్ల తెలిపారు. విశాఖలో స్వచ్ఛందంగా జనం తరలివచ్చి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడం, ఆ తరవాత ఆయన్ను నిర్బంధించడం అందరూ చూశారన్నారు. ఆ నిరంకుశత్వానికి కొనసాగింపే హోమ్ శాఖ ద్వారా ఇప్పించిన చీకటి జీవో అన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు.

ఆర్టికల్ 19ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందా? కచ్చితంగా ఏదొక రోజు జీవించే హక్కును కూడా హరిస్తారని నాదెండ్ల విమర్శించారు. ఇటీవల సత్తెనపల్లిలోని జనసేన కౌలు రైతు భరోసా సభను అడ్డుకోవాలని చూడటం వాస్తవం కాదా? సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఆంక్షలు విధించి, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ విజయవాడ బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ బళ్ళకు జెండాలు ఊపలేదా? అని నాదెండ్ల ప్రశ్నించారు. అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా? అని అడిగారు.
ముఖ్యమంత్రి పర్యటన అనగానే అన్నీ మార్గాల్లో దుకాణాలు మూయించేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారన్నారు. ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా? శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని నాదెండ్ల తెలిపారు. ప్రతిపక్ష పార్టీ సమావేశాలకు సైతం పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర హోమ్ శాఖకు ఉందని, పోలీసులకు ముందుగానే అనుమతులకు లేఖలు ఇచ్చినా తగినంత భద్రత ఇవ్వడం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకొని ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తి భద్రత ఇవ్వాలని నాదెండ్ల కోరారు. ప్రత్యేక సందర్భాల్లో అనుమతి ఇస్తాం అని జీవోలో చెప్పడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రత్యేక సందర్భాలు అనేవి కేవలం వైసీపీకి మాత్రమే వస్తాయా? అనే ప్రశ్నకు జీవో ఇచ్చిన ఉన్నతాధికారి, జీవో ఇప్పించిన పాలకుడు సమాధానం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications