కిరికిరి రెడ్డికేం తెలియదు: నాగం, హైదరాబాదుపై కెకె
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన భారతీయ జనతా పార్టీ నాయకులు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. నిజాం కళాశాలలో జరిగిన సకల జన భేరీ సభలో నాగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఒకే వాదం ఎత్తుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు. రెండు ప్రాంతాల్లోను బిజెపి తెలంగాణ అంటోందని చెప్పారు. రెండు నెలల్లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టకుంటే తాను రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానని తమ పార్టీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ చెప్పారని గుర్తు చేశారు.
బిజెపి హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుకుంటుందన్నారు. డిజిపి దినేష్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేశారని, అలాంటి ఆయన ఈ రోజు తొలగిపోతున్నారన్నారు. తెలంగాణ వ్యక్తికి డిజిపి పదవి ఇవ్వాలన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకుంటే 2014లో బిజెపి అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, తాము తెలంగాణ ఇస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ కిరి కిరి రెడ్డి అన్నారు. ఆయన నీటి యుద్ధాలు అంటూ రాగం పాడుతున్నారని కానీ వారి నీటి దోపిడీ ఆగిపోతుందనే ఆయన భయపడుతున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో చేస్తోంది ఉద్యమం కాదని అది అల్లరి అన్నారు. అదంతా కిరణ్ కుమార్ రెడ్డి ఆడిస్తున్న నాటకమన్నారు.
కిరణ్ గంటన్నర పాటు మ్యాపు, కర్ర పట్టుకున్నారని కానీ ఆయనకు నదులు, రోడ్లు ఎక్కడ ఉంటావో కూడా తెలియదన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకుంటే అందరం ఏకమై ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుదామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ బేవకూఫ్ అని పివోడబ్ల్యూ సంధ్యక్క మండిపడ్డారు. నీటి యుద్ధాలు అంటూ కిరణ్ మాట్లాడటం విడ్డూరమన్నారు.
హైదరాబాదుపై కెకె
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ వస్తుందని తెరాస నేత కె కేశవ రావు అన్నారు. సిడబ్ల్యూసి మెంబర్గా తాను ఎన్నోసార్లు తెలంగాణపై మాట్లాడానని చెప్పారు. హైదరాబాదు ఎవడి అబ్బ సొత్తు కాదని మా అబ్బ సొత్తన్నారు. హైదరాబాదు పైన కిరికిరి చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఉమ్మడి రాజధాని అంటే తాము కుర్చీ, టేబుల్, చీపురు ఇస్తామన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ వస్తుందని చెప్పారు. ఆయన లేకుంటే హైదరాబాదులో ఒక్క ఆంధ్రా వ్యక్తి కూడా హైదరాబాదులో ఉండేవాడు కాదన్నారు. తెలంగాణను ఆ దేవుడు కూడా ఆపలేడన్నారు.