నాకు మంత్రి పదవా?: తేల్చేసిన బాలకృష్ణ, లోకేష్పై ఇలా..
తనకు మంత్రి పదవిపై ఆశ లేదని హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.
విజయవాడ: తనకు మంత్రి పదవిపై ఆశ లేదని హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే కేబినెట్లో తాను స్థానం ఆశించడం లేదని అన్నారు. తనకు ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి చాలని చెప్పారు.
తన అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పట్ల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాగా, సీఎం చంద్రబాబునాయుడు తమ కేబినెట్లోకి త్వరలోనే నారా లోకేష్ను తీసుకుంటానని ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు తెలిసిందే.
హిందూపురం అభివృద్ధిపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిందూపురం నియోజకవర్గానికి నాలుగు నెలల్లోనే తాగునీటి సమస్యను పరిష్కరించి పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామన్నారు.
లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. తన వందో చిత్రం(గౌతమీపుత్ర శాతకర్ణి) పూర్తయినందున ఇకపై నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పారు.
హిందూపురంలో చాలా ఇబ్బందులున్నాయని బాలకృష్ణ అన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిందెవరో? అందరికీ తెలుసని.. కాంగ్రెస్పై పరోక్షంగా విమర్శలు చేశారు.